డీఎంకే కంచుకోటలో విజయ్ రోడ్ షో- ఇసుక వేస్తే రాలనంత జనం
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తమిళనాడులో ప్రచారం హోరెత్తుతోంది. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. టీవీకే పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిల్చోవడం వల్ల త్రిముఖ పోరు ఏర్పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరి పోరు తప్పకపోవచ్చు.
తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23వ తేదీన జరగనుంది. మే 4న ఓట్లను లెక్కిస్తారు. ఈ పరిణామాల మధ్య టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తోన్న పెరంబూరు, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాలపై అందరి దృష్టీ నిలిచింది. ఆయా చోట్ల విజయ్ అరంగేట్రం చేయడం రసవత్తర పోరుకు తెరలేపింది.

ఈ పరిణామాల మధ్య విజయ్.. తిరుచిరాపల్లి ఈస్ట్ లో అడుగు పెట్టారు. ఆయన పోటీ చేస్తోన్న రెండు నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. ఈ మధ్యాహ్నం ఆయన నేరుగా తిరుచ్చి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్ షో నిర్వహించారు. వేలాదిమంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చుని, విజిల్ ఊదుతూ, ప్లకార్డులను పట్టుకుని కనిపించారు.
తిరుచిరాపల్లి ఈస్ట్ లో సిట్టింగ్ డీఎంకే ఎమ్మెల్యే ఇనిగో ఎస్ ఇరుదయరాజ్ ను ఢీకొంటున్నారు విజయ్. 2011లో ఏర్పడిన స్థానం ఇది. మొదటి రెండు ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఆధీనంలో ఉండగా, 2021లో డీఎంకే గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఇనిగో ఇరుదయరాజ్ ఎస్, మాజీ ఎమ్మెల్యే వెల్లమండి నటరాజన్పై 53,797 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. అలాంటి అభ్యర్థులను తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తోన్న విజయ్ తలపడుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
VIDEO | Tamil Nadu Assembly polls: TVK leader Vijay holds roadshow in Tiruchi East constituency.
— Press Trust of India (@PTI_News) April 19, 2026
(Source: Third Party)
(Full video available on https://t.co/dv5TRAShcC) pic.twitter.com/K8pl4HAeso
ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఏఐఏడీఎంకే జీ. రాజశేఖరన్ను రంగంలోకి దింపింది. వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్ కన్సల్టెంట్గా ఉన్న రాజశేఖరన్.. ట్రిచీలోని ఏఐఏడీఎంకే కోశాధికారి, ఐటీ విభాగ సభ్యుడు కూడా. గత ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో తిరుచ్చి తూర్పులో డీఎంకేకు స్పష్టమైన ఆధిక్యత ఉంది. దాని పొరుగునే ఉన్న తిరుచిరాపల్లి వెస్ట్ నియోజకవర్గానికి స్వయానా డీఎంకే మంత్రి కెఎన్ నెహ్రూ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. తిరుచ్చి ఈస్ట్ పై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications