రంజుగా ''మహా'' రాజకీయం: ఎన్సీపీ కాంగ్రెస్ సహకారంతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు..?
పట్టుకుంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది మహారాష్ట్రలో బీజేపీ శివసేనల పరిస్థితి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు పఢ్నవీస్ రంగం సిద్ధం చేసుకుంటుండగా.. మరోవైపు శివసేన తమ మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అనే ధీమాతో ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే అన్ని దారులు తనవైపు ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది శివసేన పార్టీ.
పట్టు వీడని శివసేన
మహారాష్ట్రలో రాజకీయాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న రెండు కాషాయ పార్టీలు బీజేపీ శివసేన ఇప్పుడు ఎవరి దారులు వారు వెతుక్కునేలా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం బీజేపీకి 2014లో వచ్చిన సీట్లకంటే తక్కువగా రావడమే. ఇదే అదనుగా తీసుకున్న శివసేన పార్టీ ముఖ్యమంత్రి పదవీకాలం రెండు పార్టీలు చెరోసగం పంచుకోవాలనే డిమాండ్ను ముందుంచుతోంది. అయితే దీనిపై బీజేపీ పెద్దగా స్పందించడం లేదు. ఈ క్రమంలోనే శివసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ఇతర పార్టీలతో టచ్లోకి వచ్చింది.
శరద్ పవార్తో ఫోన్లో మాట్లాడిన ఉద్ధవ్ థాక్రే
శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే గురువారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఈ విషయం రెండు పార్టీల నేతలు ధృవీకరించారు. గురువారం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శరద్ పవార్ను కలిసిన సమయంలో ఆయనతో ఫోన్లోనే శరద్ పవార్తో ఉద్ధవ్ థాక్రే మాట్లాడినట్లు తెలుస్తోంది. బీజేపీ తగ్గకుంటే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనే ప్రతిపాదన శరద్ పవార్ ముందు ఉద్ధవ్ థాక్రే ఉంచినట్లు సమాచారం. ఇది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలు సహకరిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనే ప్రపోజల్ ఉద్ధవ్ థాక్రే ముందు ఉంచినట్లు సమాచారం.
అంకెల గారడీ ఇలా ఉంది..
బీజేపీ శివసేనలు కలసి పోటీ చేయగా కమలం పార్టీకి 105 సీట్లు, శివసేనకు 56 సీట్లు వచ్చాయి. అయితే పదవుల పంపకాల విషయంలో ఇద్దరికి విబేధాలు తలెత్తడంతో మహారాజకీయం మహారంజుగా మారింది. ఇక ఎన్సీపీకి 54 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్కు 44 సీట్లు ఉన్నాయి. ఇక ఈ మూడు పార్టీలు కలిస్తే 154 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనే డిస్కషన్స్ జరిగాయి. అయితే కాంగ్రెస్ ఎన్సీపీలు బయట నుంచి మద్దతు ఇచ్చే విషయంపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం.
పవార్ మద్దతు ఇస్తారన్న సంజయ్ రౌత్
బీజేపీ తమ డిమాండ్కు ఒప్పుకోకుంటే మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హెచ్చరించారు. తమకు సంఖ్యాబలం వస్తుందని వెల్లడించారు. అంతేకాదు అదే పరిస్థితి వస్తే శరద్ పవార్ మద్దతు ఇస్తానని చెప్పినట్లు దగ్గరి వ్యక్తులు కన్ఫామ్ చేశారు. ఇదిలా ఉంటే మంగళవారం రోజున శరద్ పవార్ ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలవనున్నారు. ఇక బీజేపీ తప్ప ఎవరూ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఆ పార్టీని స్వాగతిస్తామని కాంగ్రెస్ వర్గాలు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
శివసేన ట్రాప్ చేస్తోందా..?
ఇదిలా ఉంటే బీజేపీ నుంచి శివసేన ఏమైతే ఆశిస్తుందో అది దక్కించుకునేందుకే ఇలా బెదిరింపులకు దిగుతోందా అన్న అనుమానం కూడా రెండుపార్టీలకు లేకపోలేదు. అంతకంటే ముందు శివసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేయాల్సి ఉంటుందని ఆ తర్వాతే ముందడుగు పడుతుందని మరో కాంగ్రెస్ నేత చెప్పారు. ఒకవేళ శివసేనకు హోమ్ శాఖ, ఆర్థికశాఖ ఇస్తే కచ్చితంగా బీజేపీకి మద్దతుగా నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అనుమానం కూడా కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది.