భూమిలో దిగిపోయిన బోగీలు..!!
Indore- Jabalpur Overnight Express: ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాలు సర్వసాధారణం అయ్యాయి. చివరి ఆరు నెలల వ్యవధిలో నాలుగు రైలు ప్రమాదాలు సంభవించడం.. దీని తీవ్రతకు అద్దం పడుతోంది. అదృష్టవశావత్తూ భారీ సంఖ్యలో ప్రాణాపాయం సంభవించట్లేదు గానీ ఆస్తినష్టం అంచనాలకు మించిన స్థాయిలో ఉంటోంది.
ఈ ఏడాది ఏప్రిల్లో హిరాకుడ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. జులైలో ముంబై ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఆగస్టులో రెండు రైళ్లు పట్టాలు తప్పాయి. 4వ తేదీన కోర్బా, 17వ తేదీన సబర్మతి ఎక్స్ప్రెస్లు ప్రమాదాల బారిన పడ్డాయి. ఆయా ప్రమాదాల్లో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు.

ఇఫ్పుడు తాజాగా ఇండోర్- జబల్పూర్ ఓవర్నైట్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ తెల్లవారు జామున 5:50 నిమిషాలకు ఈ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రెండు బోగీలు నేలలోకి కూరుకుపోయాయి. ఇండోర్ నుంచి జబల్పూర్కు చేరుకున్న ఈ ఎక్స్ప్రెస్ అవుటర్ సిగ్నల్ దాటుకుని ఆరో నంబర్ ప్లాట్ఫామ్కు వెళ్లే సమయంలో ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ఆపద సంభవించలేదు. పట్టాలు తప్పిన రెండు బోగీల్లో ఉన్న ప్రయాణికులు సురక్షితమని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పశ్చమి- మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ హర్షిత్ శ్రీవాస్తవ తెలిపారు. ఆరో నంబర్ ప్లాట్ఫామ్కు 150 మీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు.

ఈ ఘటనలో ప్రయాణికులు భయభ్రాంతులకు గరయ్యారు. పెద్ద శబ్దం చేస్తూ బోగీలు ఒక పక్కకు ఒరిగిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. బోగీల నుంచి బయటికి దూకారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే భద్రత సిబ్బంది, జబల్పూర్ స్టేషన్ మేనేజర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications