ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు: ఇద్దరు సైనికులు మిస్సింగ్, భారీ సెర్చ్ ఆపరేషన్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ ప్రాంతంలో ఉగ్రవేట కొనసాగిస్తున్న జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీవో)తోపాటు ఓ సైనికుడు అదృశ్యం కావడంతో వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది సైన్యం. గురువారం సాయంత్రం ఉగ్రవాదులతో తీవ్రమైన ఎదురుకాల్పుల తర్వాత ఈ ఇద్దరు సైనికులు కనిపించకుండా పోయారు.
రైఫిల్మ్యాన్ యోగాంబర్ సింగ్, రైఫిల్ మ్యాన్ విక్రమ్ సింగ్ నేగి అనే ఇద్దరు సైనికులు పూంఛ్-రాజౌరి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించారు. అంతకుముందు ఇదే ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు సైనికులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో పడిపోయిన సైనికుల మృతదేహాల వెలికితీత సైన్యానికి సవాలుగా మారింది. కాగా, గురువారం జేసీవో నుంచి కాంటాక్ట్ అందకపోవంతో సైన్యం గాలింపు ముమ్మరం చేసింది.
అక్టోబర్ 14న పూంఛ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, సైనికులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. జేసీవోతోపాటు ఓ సైనికుడు ఎదురుకాల్పుల అనంతరం కనిపించకుండా పోయారని తెలిపింది. వీరు తీవ్రగాయాలపాలైనట్లు తెలుస్తోందని వెల్లడించింది. వీరిద్దరి కోసం భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. జేసీవోతోపాటు మరో సైనికుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఓ ఆర్మీ సీనియర్ అధికారి తెలిపారు. కాగా,
కాగా, జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల పౌరులపై ఉగ్ర దాడుల అనంతరం భారీ ఆపరేషన్ చేపట్టాయి భద్రతాదళాలు. ఈ స్పెషల్ ఆపరేషన్లో ఇప్పటివరకు 11 మంది ముష్కరులు హతమయ్యారు. మొత్తం 8 ఎన్కౌంటర్లలో 11మందిని మట్టుబెట్టారు. ఐతే పాంపోర్ ఎన్కౌంటర్లో ఎల్ఈటీ కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖాందే చిక్కినట్లు వెల్లడించాయి భద్రతాదళాలు. జమ్మూకాశ్మీర్ పోలీసుల టాప్-10 వాంటెడ్ జాబితాలో ముస్తాక్ ఉన్నట్లు తెలిపారు.
బాఘాట్ శ్రీనగర్లో ఇద్దరు పోలీసులను హతమార్చడం సహా.. పలు ఉగ్రదాడుల్లో ముస్తాక్ పాల్గొన్నట్టు వెల్లడించారు. పౌరులపై ఉగ్ర దాడులతో.. తాము ఈ ఆపరేషన్ చేపట్టామన్నారు పోలీసులు. పౌరుల రక్షణ తమ బాధ్యతని, అందుకే వరుస ఆపరేషన్లతో ముష్కరులను ఏరివేస్తున్నట్లు తెలిపారు. తప్పించుకున్న వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు.