రెండు రాష్ట్రాలు మళ్లీ విలీనం కావు: బాబు, కెసిఆర్పై విసుర్లు
వరంగల్: రెండు రాష్ట్రాలు కలిసే ప్రసక్తి లేదని, దీన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విడిపోయినా ఒకరికొకరు సహకరించకుంటే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. కలిసి నడిస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. నేను ఏమైనా తప్పు చేశానా అని అడిగారు. తెలుగు ప్రజలకు తాను అన్యాయం చేయబోనని ఆయన అన్నారు. తెలుగు ప్రజలంతా ఒక్కటి, రాష్ట్రాలుగా విడిపోయినా మానసిక కలిసి ఉందామని తాను చెప్తే దానికి కూడా పెడర్థాలు తీస్తున్నారని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాలను రెండింటిని అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు.
విభజన జరిగిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటే ఆనందంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇద్దరు కూర్చుందామని, చర్చించుకుందామని, కావాలంటే పెద్దమనిషిని పెట్టుకుందామని, ఇంకా కేంద్రం మధ్యవర్తిత్వాన్ని కోరుదామని చెబుతుంటే ముందుకు రావడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను ఉద్దేశించి అన్నారు.
రెండు ప్రాంతాల్లో తనను గౌరవించారని, పెద్ద మనిషిగా రెండు ప్రాంతాల గురించి ఆలోచిస్తానని ఆయన అన్నారు. దాదాపు 19 ఏళ్లు రెండు ప్రాంతాలను అభిమానించారని, తాను ఏ విధంగా ఓ ప్రాంతానికి అన్యాయం చేస్తానో, ఓ ప్రాంతాన్ని వదిలిపెడుతాననో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. ఆంధ్రకు రావాలని అన్నారని, బ్రహ్మరథం పడుతామని అన్నారని, తాను తనను అభిమానించిన తెలంగాణ తమ్ముళ్లను వదులుకోనని చెప్పినట్లు ఆయన తెలిపారు.విభజనలో ఏ విధమైన సమస్యలున్నాయో మీరే చూస్తున్నారని ఆయన అన్నారు.
తాను బాబ్లీ ప్రాజెక్టు ఎత్తును పెంచడానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే కాంగ్రెసు, టిఆర్ఎస్ పార్టీలు రెండు టిఎంసిలే కదా అని అన్నారని, దాని నష్టం ఇప్పుడు తెలుస్తోందని, కృష్ణా జలాలపై కూడా హక్కు కోల్పోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. తెలంగాణ ప్రజలు టిడిపిని బలపరిచారు, ఆదరించారు, అభిమానించారని ఆయన అన్నారు. తనపై అత్యంత ప్రేమాభినాలు చూపించారని ఆయన అన్నారు. వెనకబడిన తెలంగాణను అభివృద్ధి చేయడానికి తాను అధికారంలో ఉన్నప్పుడు ఎంతో శ్రద్ధ పెట్టానని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాటాలు చేశానని ఆయన చెప్పారు. తాను చేపట్టిన కార్యక్రమాల వల్ల తెలంగాణలో ఫలితాలు వచ్చాయని ఆయన అన్నారు.
తాను నిస్వార్థంతో వస్తున్నానని ఆయన చెప్పారు. హైదరాబాదును అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తెచ్చానని, ఐటి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా కృషి చేశానని ఆయన చెప్పారు. తన దూరదృష్టితో తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని, దానికి తాను ఆనందించానని ఆయన చెప్పారు. తెలంగాణలోని పార్టీ కార్యకర్తల ప్రాణాలకు ప్రాణం అడ్డం పెడుతానని ఆయన అన్నారు. సమర్థమైన నాయకత్వాన్ని ముందు పెడుదామని ఆయన అన్నారు. రాజకీయ చైతన్యం ఉన్న వరంగల్లోనే సమావేశం పెట్టాలని అనుకున్నామని ఆయన అన్నారు. తన జీవితంలో ఎప్పుడు జరగని రీతిలో ఈ రోజు సభ జరిగిందని, ఇదో చరిత్ర అని ఆయన అన్నారు. ఉదయం 11 గంటలకు జరగాల్సిన సమావేశం సాయంత్రం ప్రారంభమైందని, సాయంత్రం ఏడున్నర అయినా ఎవరూ కదలలేదని, ఇదో చరిత్ర అని ఆయన అన్నారు.
పాలకుర్తి వస్తుంటే గతంలో తనపై రాళ్లు వేశారని, ఈ రోజు ప్రజలు నీరాజనాలు పట్టాని, ఇది తన జీవితంలో మరిచిపోలేనని ఆయన అన్నారు. తన కుటుంబ సభ్యులైన కార్యకర్తలతో గడపడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. తాను రాజకీయాలు చేయడానికి ఇక్కడికి రాలేదని, కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి వచ్చానని ఆయన అన్నారు. ఏ స్థాయిలో ఉన్నా తాను కార్యకర్తలకు న్యాయం చేయడంపైనే తన దృష్టి ఉంటుందని ఆయన చెప్పారు. 35 ఏళ్లు నిరంతరం పోరాటం చేశారని ఆయన చెప్పారు. తాను వరంగల్ వస్తున్నానంటే కార్యకర్తల్లో పట్టుదల పెరిగిందని ఆయన చెప్పారు. టిడిపికి పూర్వ వైభవం తీసుకు రావడానికి పనిచేశారని ఆయన అన్నారు.
మూడోసారి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నామని, పార్టీ కోసం అంకిత భావంతో కార్యకర్తలు ఉన్నారని, వారిని తాను మరిచిపోలేనని ఆయన చెప్పారు. కార్యకర్తలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకురావడానికి తాను కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉండాలని తీర్పు ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండాలని తీర్పు ఇచ్చారని, కేంద్రంలో తాము మద్దతు ఇచ్చిన ఎన్డియె అధికారంలో ఉండాలని ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణకు చేయాల్సింది ఉందని ఆయన అన్నారు. తాను రాజీ పడబోనని, తప్పకుండా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని, రెండు రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ తెలంగాణకు ఎంతో చేశారు, తానూ చేశానని ఆయన చెప్పారు. తెలంగాణకు సంక్షేమ పథకాల ద్వారా సేవ చేస్తే, తాను అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సేవ చేశానని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. సాగునీటి ప్రాజెక్టులకు తాను తెలంగాణలో అధిక ప్రాధాన్యం ఇచ్చానని ఆయన చెప్పారు. దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా అన్ని ప్రాజెక్టులను తామే ప్రారంభించామని ఆయన చెప్పుకున్ారు. ఎస్సార్సీ రెండో దశను కూడా తామే పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవడానికి పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు.