కరోనా విజృంభణపై మోదీ సమీక్ష.. రెండొంతుల కేసులు 5 రాష్ట్రాల్లోనే..
దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(జూన్ 3) సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా,కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్,ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎం పీకే సిన్హా,కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ,హెల్త్ సెక్రటరీ ప్రీతి సుదన్,ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాబోయే రెండు నెలల్లో దేశవ్యాప్తంగా కరోనా ఎలాంటి ప్రభావం చూపించనుందన్న దానిపై సమావేశంలో చర్చించారు. రాబోయేది వర్షా కాలం కావడంతో.. ఆ సీజన్లో వైరస్ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్దంగా ఉన్నాయో లేదో సమీక్షించాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఎమర్జెన్సీ ప్లానింగ్పై రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరపాలన్నారు.
దేశంలో నమోదవుతున్న కేసుల్లో ప్రధానంగా ఐదు రాష్ట్రాల నుంచే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. టెస్టులు, బెడ్ల సంఖ్యను పెంచాలన్నారు.
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రులను ఆదేశించారు. దీంతో ఈ నెల 14 (ఆదివారం)న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్తో హోంమంత్రి అమిషా భేటీ కానున్నారు. మరోవైపు ఈ నెల 16,17 తేదీల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు,అన్ లాక్ 1.0 ప్రభావం గురించి చర్చించనున్నారు.