పెళ్లి పేరుతో వ్యభిచార కూపంలోకి : ముఠా దురాగతాలు బహిర్గతం చేసిన మహిళలు
జైపూర్ : పెళ్లి పేరుతో ఒకరు, చిన్నప్పుడే మరొకరు వ్యభిచార కూపంలో నెట్టబడ్డారు. నమ్మి వచ్చిన వారే నట్టేట ముంచడంతో చేసేదేమీ లేక చేష్టలుడి చూశారు. ఆ నరకకూపంలో లైంగికదాడికి గురైన బాధిత మహిళలు .. ఎట్టకేలకు బయటకొచ్చారు. జరిగిన దురాగతంపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్లోని చూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది.
ఇలా కూపంలోకి ...
ముంబైకి చెందిన 24 ఏళ్ల మహిళ, జార్ఖండ్కు చెందిన 21 ఏళ్ల మహిళలు ఇద్దరు వ్యభిచార కూపంలో ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఎలాగోలా తప్పించుకొని బయటపడ్డారు. తమపై జరిగిన ఆకృత్యాలను సమాజానికి తెలిపి .. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముంబైకి చెందిన మహిళ తన సవతితల్లితో కలిసి కిసన్ఘడ్ పట్టణంలో ఉండేది. అయితే సవతి తల్లి పెళ్లి చేసుకోవాలని కూతురిపై ఒత్తిడి చేసింది. చివరికి పెళ్లికి ఆమె ఒప్పుకోవాల్సి వచ్చింది. అంగీకరించిందో లేదో .. హర్యానాలోని హిసార్ జిల్లా అదంపూర్కి చెందిన నిక్కిని పిలిపించింది. అతగాడు తను మ్యారేజ్ బ్రోకర్ అని చెప్పి .. యువతి గొంతుకోశాడు. తనతో కూతురిని పంపాలని .. పెళ్లికొడుకును చూపించి 15 రోజుల్లో తీసుకొస్తానని చెప్పడంతో సవతి తల్లి నమ్మి పంపించింది. దీంతో యువతిని తీసుకొని రాజస్థాన్లోని చురు జిల్లాకొచ్చాడు నిక్కీ. అక్కడ వ్యభిచార కూపానికి రూ.70 వేలకు విక్రయించి తిరిగి ఇంటికొచ్చాడు. దీంతో ఆ మహిళ .. పెళ్లి అని చెప్పి మోసం చేశారని గ్రహించి .. బోరుమని విలపించింది.
ఇదీ నేపథ్యం .
ముంబై మహిళ గాధ ఇదీ కాగా .. అక్కడ యువతి కనిపించింది. ఏం జరిగిందిన ఆరా తీస్తే ఆ యువతి కన్నీటి పర్యంతమైంది. తనను ఐదేళ్ల క్రితం ఇక్కడికి తీసుకొచ్చారని .. ఈ నరకకూపంలో లైంగికదాడి చేస్తున్నారని వాపోయింది. తనను కూడా రూ.85 వేలకు విక్రయించారని ముంబై మహిళతో చెప్పి .. కన్నీరు మున్నీరుగా విలపించింది. అంతేకాదు తమను అమ్మిన వ్యక్తి కూడా లైంగికదాడి చేసేందుకు ప్రయత్నిస్తే .. ప్రతిఘటించామని పేర్కొన్నారు. తర్వాత జాట్కు చెందిన జైపాల్ చాలామంది యువతులను ఈ కూపంలోకి లాగుతున్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని ఎలాగైన బహిర్గతం చేయాలని .. బయటకు పారిపోయి వచ్చామని ఆ ఇద్దరు మహిళలు మీడియాకు వివరించారు.
చర్యలు తప్పవు
చూరులో జరిగిన ఘటనపై కేసు నమోదు చేశామని యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ సెల్ తెలిపింది. ఇద్దరు మహిళలు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతున్నామని ఎస్పీ మహేంద్ర దత్ శర్మ పేర్కొన్నారు. నిందితులపై 370. సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి మేజిస్ట్రేట్ ఎదుట బాధితుల వాంగ్మూలం రికార్డు చేశామని ఆయన వివరించారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టంచేశారు.