Uber buses: దేశంలో ఇక ఉబర్ బస్సు సర్వీసులు, తొలుత ఈ నగరంలోనే
న్యూఢిల్లీ: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ (Uber) త్వరలోనే భారతదేశంలో బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మొదట ఈ సేవలను ప్రారంభించనుంది. డిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద బస్సులను నడపనుంది. తాజాగా, ఈ మేరకు ఢిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ అందుకోవడం గమనార్హం.
అంతేగాక, ఈ తరహా లైసెన్స్ జారీ చేసిన తొలి రవాణా శాఖ ఢిల్లీనే కావడం విశేషం. మరోవైపు, దేశంలో దీన్ని అందుకున్న తొలి అగ్రిగేటర్గా ఉబర్ నిలిచింది. కాగా, ఏడాది కాలంగా ఢిల్లీ-ఎన్సీఆర్ తోపాటు కోల్కతాలోనూ ప్రయోగాత్మకంగా ఈ సేవలు నడుపుతున్నామని ఉబర్ షటిల్ ఇండియా హెడ్ అమిత్ దేశ్పాండే వెల్లడించారు.

ఢిల్లీలో బస్సులకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు గమనించి ఇక్కడ బస్సులు నడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు అధికారికంగా తమ సేవనలు ప్రారంభించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. బస్సు సర్వీసులను వారం ముందు నుంచే ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చని ఉబర్ తెలిపింది.
బస్సు రాబోయే సమయం, బస్సు లైవ్ లొకేషన్, బస్సు రూట్లను ఎప్పటికప్పుడు ఉబర్ యాప్లో తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. ఒక్కో సర్వీసులో 19-50 మంది ప్రయాణించడానికి వీలుంటుందను తెలిపింది. ఉబర్ టెక్నాలజీ సాయంతో స్థానిక ఆపరేటర్లు బస్సులను నడుపుతారని ఉబర్ సంస్థ వెల్లడించింది. ఢిల్లీలో విజయవంతమైతే.. ఆ తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో బస్సు సర్వీసులను నడపాలని ఉబర్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications