నేను సీఎం కావాల్సిందే, ఇదే చివరి ప్రతిపాదన: థాక్రే
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ - శివ సేన సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా తమ పార్టీకి 151 సీట్లు కావాలని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే అన్నారు. బీజేపీకి 119 సీట్లు మాత్రమే ఇస్తామని ప్రతిపాదించారు. అంతేకాకుండా మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని కావాల్సిందేనని ఉద్దవ్ థాక్రే భీష్మించుకు కూర్చున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 25 ఏళ్లగా రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది. ఐతే ఈసారి సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ధాకరే మాట్లాడుతూ మిత్ర పక్షాలతో పొత్తు సంక్లిష్టంగా తయారైందని, భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు ఇదే చివరి ప్రతిపాదనని అన్నారు. భారతీయ జనతా పార్టీకి 119 సీట్లు, ఇతర మిత్ర పక్షాలకు 18 సీట్లు కేటాయించడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. ఐతే ఈ ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ తిరస్కరించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై శివసేన చేసిన ప్రతిపాదనలో కొత్త అంశం ఏమీ లేదని భారతీయ జనతా పార్టీ తెలిపింది. సీట్ల సర్దుబాటు చర్చలతో పరిష్కరించుకోవాలని, మీడియా ద్వారా కాదని తెలిపింది. శివసేనతో పొత్తు కొనసాగించడానికే తాము సిద్దంగా ఉన్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్నికల్లో గెలిచి తీరాలనే ఈ ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ ముందు ఉంచినట్లు ఆయన తెలిపారు. ఐతే భారతీయ జనతా పార్టీ మాత్రం చెరో 135 సీట్లలో పోటీ చేద్దామని, మిగిలిన 18 సీట్లను భాగస్వామ్య పక్షాలైన చిన్న పార్టీలకు కేటాయిద్దామని బీజేపీ ప్రతిపాదించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శివసేనతో సీట్ల సర్దుబాటు విషయమై ఏర్పడిన వివాదంపై చర్చించేందుకు బీజేపీ సన్నద్దమైంది. ఈమేరకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో శివసేనతో సీట్ల సర్దుబాటు విషయమై ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తోన్నారు.
2009 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 160 సీట్లకు పోటీ చేసి 44 గెల్చుకోగా, బీజేపీ కేవలం 119 సీట్లకు పోటీ చేసినా, 46 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ 23 సీట్లు గెల్చుకోగా, శివసేన 18 సీట్లు మాత్రమే గెల్చుకుంది.