బీజేపీలో గూండాలు, ఒంటరిగా పోటీ: మోడీకి షాకిచ్చిన శివసేన
బీజేపీకి శివసేన అధినేత ఉద్దవ్ థాకరే షాకిచ్చారు. రానున్న మునిసిపల్ కార్పోరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు.
ముంబై: బీజేపీకి శివసేన అధినేత ఉద్దవ్ థాకరే షాకిచ్చారు. రానున్న మునిసిపల్ కార్పోరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. తాను, తమ కార్యకర్తలు ఒంటరిగా పోటీకి సిద్ధంగా ఉన్నారని ఉద్దవ్ చెప్పారు.
తమకు మంచి కార్యకర్తలు ఉన్నారని, వారు వెన్నుపోటు పొడవరని, నేరుగా పోరాడుతారని చెప్పారు. ఓసారి నేను నిర్ణయం తీసుకుంటే, ఎవరూ అడగలేరన్నారు. బీజేపీలో గూండాలు ఉన్నారని, శివసేనలో సైనికులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను అలయెన్స్ కోసం ఎవరినీ అడగనని చెప్పారు. ఎవరి తలుపు తట్టేది లేదని చెప్పారు. తమకు ఎవరి జాలి అవసరం లేదని చెప్పారు. మున్సిపల్ కార్పోరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.
కాగా, బీఎంసీ (బృహన్ ముంబై కార్పోరేషన్) ఎన్నికల్లో 227 సీట్లకు గాను బీజేపీ 114 స్థానాలు అడుగుతోంది. శివసేన మాత్రం 60 సీట్లకు మించి ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. బీఎంసీ ఎన్నికలు ఫిబ్రవరి 21వ తేదీన జరగనున్నాయి.