విజయ్ పై ఒత్తిడి: మొదటి అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్: ఉదయనిధి ఎత్తుగడ
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ నేతృత్వంలో మొదటిసారిగా పూర్తిస్థాయి శాసనసభ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్న ఈ సమావేశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. శాంతిభద్రతల వైఫల్యం, ప్రజల సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు సిద్ధం అయ్యాయి.
ఈ చారిత్రక అసెంబ్లీ సమావేశాల కోసం ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రతిపక్ష కూటమి నేతలు కూడా వ్యూహాత్మకంగా హాజరయ్యారు. ప్రతిపక్షం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామితో పాటు డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీకి విచ్చేశారు. వస్తూ వస్తూనే ఉదయనిధి స్టాలిన్ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ప్లకార్డులతో ఆయన హాజరయ్యారు. డీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లలపై పెరుగుతున్న దాడులు, శాంతిభద్రతల క్షీణతపై విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మౌనం వహిస్తోందని డీఎంకే ఆరోపించింది. డీఎంకే శాసనసభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు చేతబూని అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు దిగారు. సీఎం విజయ్ మౌనం వీడాలంటూ ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభలోకి ప్రవేశించారు.
ఈ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్ ప్రజల కోసం కొన్ని సరికొత్త సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక చేయూత అందించే పథకం అమలుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే ఫైలుపై సీఎం విజయ్ సంతకం చేస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది.
టీవీకే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికారిక వేడుకల్లో జాతీయ గీతానికే ప్రాధాన్యత ఇస్తుండటంపై విమర్శలు వచ్చాయి. తమిళనాడు శాసనసభ సంప్రదాయాల ప్రకారం సభ ప్రారంభంలో తమిళ మాత వందనం గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. నేటి సభలో ఈ సంప్రదాయాన్ని పాటించే అవకాశం ఉంది.
శాసనసభ వేదికగా ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న తీవ్ర ఆరోపణలను తిప్పికొట్టేందుకు విజయ్ ప్రభుత్వం సిద్ధమైంది. సభ సాఫీగా సాగేందుకు అధికార పక్షం తగిన ఏర్పాట్లు చేసుకుంది. ముఖ్యంగా శాంతిభద్రతల అంశాన్ని రాజకీయం చేయడానికే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా ప్రజా సమస్యల పరిష్కారం కంటే రాజకీయ ఆధిపత్య పోరుకే ఈ సభ వేదికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications