Union Budget 2020:యువ ఇంజనీర్లకు మున్సిపల్ కార్పోరేషన్లలో ఇంటర్న్షిప్ : సీతారామన్
Recommended Video
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో యువ ఇంజనీర్ల వృత్తిపరమైన అవకాశాల కోసం సరికొత్త ప్రణాళికను ప్రతిపాదించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే ఆయా రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పోరేషన్లలో యువతకు ఏడాది పాటు ఇంటర్న్షిప్ అవకాశాన్ని అందించేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పోరేషన్లలో ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు.
ఇంజనీరింగ్ తర్వాత చాలామంది విద్యార్థులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని.. అదే సమయంలో మున్సిపల్ కార్పోరేషన్లలో సిబ్బంది కొరత ఉంటోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాబట్టి మున్సిపల్ కార్పోరేషన్లలో యువ ఇంజనీర్లకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడం ఇరువురికి లబ్ది చేకూరుస్తుందన్నారు.
ఇక దేశంలో కొత్త విద్యా విధానాన్ని త్వరలో ప్రకటిస్తామని,విద్యా విధానంపై దాదాపు 2లక్షల సలహాలు,సూచనలు స్వీకరించామని చెప్పారు. 2020-21కి గాను దేశంలో విద్యా రంగానికి రూ.90వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. అలాగే రూ.3వేల కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను చేపట్టబోతున్నట్టు చెప్పారు. దేశంలో అర్హత కలిగిన వైద్యుల కొరత ఉందని.. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీని అనుసంధానం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు.