హష్ కాకి: అమ్మకానికి రెండు ప్రభుత్వ సంస్థ బ్యాంకులు..ఏం జరుగుతోంది..?
న్యూఢిల్లీ: పెట్టబడుల ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరేమిటో స్పష్టం చేసింది. పార్లమెంట్ సాక్షిగా కుండబద్దలు కొట్టింది. టార్గెట్ పెట్టి మరీ పెట్టుబడులను ఉపసంహరించుకోబోతోన్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరంభం కాబోయే 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో ఈ అంశాన్ని చేర్చింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో లక్షా 75 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. 2020-2021 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ మొత్తం తక్కువే.

అమ్మకానికి ఐడీబీఐ బ్యాంకు
ఈ ఏడాది అమ్మకానికి ఉంచిన ప్రభుత్వ రంగ సంస్థల జాబితాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిండుసభలో ప్రకటించారు. ఈ జాబితాలో రెండు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులను కూడా చేర్చారు. ప్రభుత్వరంగానికి చెందిన ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)ను ఈ జాబితాలో చేర్చారు. ప్రభుత్వ రంగానికే చెందిన మరో బ్యాంకు, ఓ జీవిత బీమా కంపెనీలో కూడా పెట్టుబడులను ఉపసంహరించుకోబోతోన్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

పెట్టుబడుల ఉపసంహరణ
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్), ఎయిరిండియా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల్లో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుందని తెలిపారు. వాటిని ప్రైవేటీకరించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు..ఇప్పటికే ఆమోదించిన జాబితాలో యధాతథంగా ఉంటుందని అన్నారు. కాగా- ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీఓ వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని 74కు పెంచినట్లు వెల్లడించారు. ఇదివరకు ఈ మొత్తం 49 శాతానికి మాత్రమే పరిమితమై ఉండేది.

రూ.2.1 లక్షల కోట్లు ఉనసంహరణ
సెంటర్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈ) పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 19,499 కోట్ల రూపాయలను ఆర్జించినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మరో రెండు నెలల సమయం మిగిలి ఉన్నందున ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2.1 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటూ గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్యాన్ని అందుకుంటామని కేంద్రమంత్రి ధీమా వ్యక్తం చేశారు.