Budget 2023: తినబోతూ రుచులెందుకు..!!
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తోన్న వార్షిక బడ్జెట్.. ఇంకాస్సేపట్లో వెలువడనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ (Budget 2023) ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. గత రెండేళ్ల తరహాలోనే ఇది కూడా పేపర్ లెస్ బడ్జెట్. బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ సామాన్య పౌరులకు అందుబాటులో ఉంచింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ మొబైల్ యాప్, వెబ్ సైట్ లో పొందుపర్చనుంది కేంద్రం.
దేశ రాజధానిలో బడ్జెట్ హడావుడి నెలకొంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం కొనసాగుతున్న నార్త్ బ్లాక్ సహా, ఆ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, సహాయ మంత్రులు భగవత్ కరద్, పంకజ్ చౌదరి నివాసాల్లో ఈ తెల్లవారు జాము నుంచే సందడి నెలకొంది. నార్త్ బ్లాక్ తో పాటు నిర్మల సీతారామన్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు గుమికూడారు.
బడ్జెట్ నేపథ్యంలో భగవత్ కరద్ తన నివాసంలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తన శాఖ అధికారులతో కలిసి నార్త్ బ్లాక్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడ నిర్మల సీతారామన్ తో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన హైలైట్స్ తో కూడిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేస్తారు. అనంతరం కేంద్ర మంత్రివర్గ సమావేశానికి వారంతా హాజరవుతారు. ఉదయం 10 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమౌతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహిస్తారు. బడ్జెట్ ప్రతిపాదనలను ఈ సమావేశం ఆమోదిస్తుంది. అనంతరం పార్లమెంట్ భవనానికిక చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రతిపాదలను ప్రవేశపెడతారు. కాగా తన నివాసం వద్ద భగవత్ కరద్ కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
#WATCH | MoS Finance Dr Bhagwat Kishanrao Karad offers prayers ahead of the presentation of #UnionBudget2023 by the government pic.twitter.com/CDs5LYaf4o
— ANI (@ANI) February 1, 2023
బడ్జెట్ ఎలా ఉంటుందనే విషయం గురించి తాను ఇప్పుడు ఎలాంటి కామెంట్స్ చేయలేనని అన్నారు. ఉదయం 11 గంటలకు దేశ ప్రజలకు దాని విలువ తెలుస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని తమ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల వారికి కూడా సమన్యాయం చేస్తుందని ఆయన క్లుప్తంగా చెప్పుకొచ్చారు.