Union Budget 2023: డిడక్షన్స్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ ఖర్చులు.. ఉద్యోగస్తులు బడ్జెట్లో ఏం కోరుకుంటున్నారు..?
Union Budget 2023:కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలిఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్ను తయారు చేసి తుది మెరుగులు అద్దుతోంది. అయితే ఈ సారి నిర్మలమ్మ బడ్జెట్ ఇటు ఉద్యోగస్తులను అటు మధ్యతరగతివారిని మెప్పిస్తుందా లేదా అనేది చాలా ఆసక్తికరంగా మారింది.
కరోనాతో వరుసగా రెండేళ్ల పాటు ఉద్యోగస్తులకు వేతన జీవులకు కేంద్రం ప్రకటించిన బడ్జెట్ నిరాశే కలిగించింది. ప్రస్తుతం అంతా గాడిలో పడిందని కేంద్రం చెబుతుండగా.. ఈ సారైన తమకు బడ్జెట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఊరట కల్పిస్తుందనే చిన్న ఆశతో ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నారు. దేశంలో ఆదాయ పన్ను కట్టే వారిలో అధిక సంఖ్యలో ఉద్యోగస్తులు ఉన్నారు. మరి అలాంటి వారి కోసం నిర్మలమ్మ ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తుందనే అంశం చర్చనీయాంశమైంది. బడ్జెట్ 2023 ఉద్యోగస్తుల జీవితాల్లో చాలా కీలకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆదాయపు పన్ను నిబంధనలను రివైజ్ చేసేందుకు ప్రభుత్వానికి 2023 బడ్జెట్ గొప్ప అవకాశంగా భావిస్తున్నారు నిపుణులు.
ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే కేంద్ర బడ్జెట్ 2023లో నిర్మలమ్మ తీపి కబురు చెబుతుందనే ఆశిస్తున్నారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని ఆదాయపు పన్ను అంశంలో కొంత రిలీఫ్ ఇస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయినందున కచ్చితంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలపై ఆలోచించాలని చెబుతున్నారు. అయితే బడ్జెట్ 2023 గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం
HRA నిబంధనలను సవరించాలి
హౌజ్ రెంటల్ అలవెన్స్ (HRA)అంశాన్ని తీసుకుంటే మెట్రో నగరాల్లో HRA ఎలా ఉండాలనే దానిపై ఒక స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని చాలామంది నిపుణులు కోరుతున్నారు. బెంగళూరు, హైదరాబాదు లాంటి నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అమాంతంగా పెరిగిపోయింది. అంటే అక్కడ ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. అయితే HRA డిడక్షన్స్లో ఈ నగరాలు మెట్రో నగరాలుగా పరిగణించబడటం లేదని చెబుతున్నారు. బెంగళూరు హైదరాబాదు నగరాల్లో ఐటీ విపరీతంగా పెరిగిపోతోంది. అదే సమయంలో ఇక్కడ ఇంటి అద్దెలు, ఉద్యోగస్తుల వేతనాలు కూడా పెరుగుతున్నాయి.ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై నగరాలు మాత్రమే HRA డిడక్షన్స్ కింద మెట్రో నగరాల జాబితాలో ఉన్నాయి. హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాలు ఈ జాబితాలో లేకపోవడం దురదృష్టకరమని విశ్లేషకులు భావిస్తున్నారు.
జాయినింగ్ బోనస్ పై పన్ను
ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగస్తులు చేరిన సమయంలో వారికి జాయినింగ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ముందుగా చెప్పిన ఫలానా సమయం వరకు ఆ ఉద్యోగి ఆ కంపెనీలో పనిచేయకుండా మానేస్తే ముందుగా తీసుకున్న జాయినింగ్ బోనస్ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి వారు ఆదాయపు పన్ను నికర మొత్తాన్ని పొందుతారు. ఒకవేళ కంపెనీని వీడుతున్న ఆర్థిక సంవత్సరం చేరిన ఆర్థిక సంవత్సరంతో వేరుగా ఉంటే అలాంటి ఉద్యోగస్తులకు పన్నులో కొంత వరకు రిలీఫ్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయపు పన్ను స్లాబ్ రివిజన్
ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అంటే ఫ్రెషర్స్ కూడా కనీసం రూ.5 లక్షల నుంచి 7 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందుతున్నారు. పన్నులు ఒకవైపు మరోవైపు పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్తో ఆ ఉద్యోగి ఖర్చులు మరియు సేవింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాదు తనకు వస్తున్న జీతంతో తనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులను కూడా పోషించుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక కష్టాలతో సతమతమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక సెక్షన్ 80C,80Dలకింద వచ్చే మినహాయింపులను సవరించాలని కోరుతున్నారు. సెక్షన్ 80సీ కింద ప్రస్తుతం రూ.1.5 లక్షల పరిమితిని నిర్ణయించడం జరిగింది. ఈ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచడం ద్వారా సామాన్యులకు ప్రయోజనం చేకూర్చినట్లవుతుంది. గత కొన్నేళ్లుగా సెక్షన్ 80Dకింద వచ్చే మెడికల్ బీమాను సవరించలేదు. ప్రస్తుతం ఉన్న రూ.25వేల నుంచి రూ.50 వేలకు రివైజ్ చేయాలని కోరుతున్నారు.కరోనా సమయంలో ఇన్ష్యూరెన్స్ కంపెనీలు ప్రీమియంను పెంచాయనే విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. వృద్ధులకు ప్రస్తుతం ఉన్న రూ.50వేల మెడికల్ ఇన్ష్యూరెన్స్ను రూ.75వేలకు పెంచాలని కోరుతున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఖర్చులు
కరోనా సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. అయితే కరోనా తగ్గిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం తమ ఉద్యోగస్తులను ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నాయి. కొందరు మాత్రం ఇంకా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే హోమ్ ఆఫీసు ఖర్చులు డిడక్షన్స్ కింద అనుమతించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.