బిగ్ బ్యాంగ్ యంత్రంలా...: తమిళనాడులో రూ.1500 కోట్లతో ఐఎన్ఓ
న్యూఢిల్లీ: ఐరాపాలో నిర్మించిన బిగ్ బ్యాంగ్ లాంటిది భారత దేశంలో కూడా రాబోతోంది. ఇండియా బేస్డ్ న్యూట్రినో అబ్జర్వేటరీ (ఐఎన్ఓ)కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిని రూ.1500 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఓకే చేసింది.
అధిక శక్తితో కూడిన పరమాణు భౌతిక శాస్త్ర ప్రయోగాలను ఇందులో చేపట్టనున్నారు. ముంబైలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) దీనికి ప్రధాన సంధానకర్తగా ఉండనుంది. ఈ అబ్జర్వేటరీని తమిళనాడులోని తేని జిల్లాలోని పొట్టిపురంలో నిర్మిస్తారు.
1300 మీటర్ల ఎత్తు ఉన్న పర్వతం కింద నేలమాళిగలో నిర్మించనున్నారు. ఈ ల్యాబ్ను రెండు కిలోమీటర్ల పొడవు, 7.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న సొరంగంతో కలుపుతారు. అత్యంత చిన్న రేణువులైన న్యూట్రినోల గురించి ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా అధ్యయనం చేయనున్నారు.
ఈ అబ్జర్వేటరీ భౌతిక, జీవ తదితర ఇతర అంశాలపై పరిశోధన చేసే పూర్తిస్థాయి సైన్స్ లాబోరేటరీగా వృద్ధి చెందుతుందని చెబుతున్నారు.
న్యూట్రినోల లక్షణాలను అధ్యయనం చేసేందుకు 50 కిలోటన్ మ్యాగ్నలైడ్జ్ ఐరన్ కేలోరీమీటర్ డికెక్టర్ నిర్మాణానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లేబోరేటరీని, డిటెక్టర్ను సాకారం చేసేందుకు మధురైలో ఇంటర్ ఇనిస్టిట్యూషనల్ సెంటర్ ఫర్ హై ఎనర్జీ ఫిజిక్స్ని నిర్మించనున్నారు. ప్రతిపాదిత ఐఎన్ఓకు ఈ నగరం 110 కిలోమీటర్ల దూరంలో ఉంది.