Nirmala Sitharaman: టమాటా ధరలు ఎందుకు పెరిగాయంటే.. చెప్పేసిన నిర్మలమ్మ..
దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ధరల కారణంగా చాలా మంది టమాటా తినడమే మానేశారు. టమాటా ధరల పెరుగుదల పై పార్లమెంట్ లో చర్చ జరిగింది. భారీగా పెరిగిన టమాటా ధరలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎంపీ కళానిధి వీరస్వామి ప్రశ్నించారు. ఎంపీ ప్రశ్నపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఉత్తరాదిన భారీ వానలతో టమాటా పంట దెబ్బతిన్నదని, అందుకే ధరలు పెరిగాయని చెప్పారు.
పంట సీజన్ మార్పు, కర్ణాటక కోలార్ జిల్లాలో టమాటా పంటకు వైట్ ఫ్లై తెగులు రావడంతో దిగుబడి తగ్గిందన్నారు. డిమాండ్ పెరడం, ఉత్పత్తి తగినంత లేకపోవడం వల్ల కూడా ధర పెరిగిందన్నారు. కంది పప్పు పెరుగుదలపై కూడా మంత్రి వివరణ ఇచ్చారు. కందుల దిగుబడి తగ్గిందన్నారు. కేంద్రం పప్పు దినుసులు, పప్పు బఫర్ స్టాక్ నుంచి స్టాక్ విడుదల చేస్తూ ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

మరోవైపు ట్రేడర్లకు స్టాక్ నిల్వ పరిమితి విధిస్తున్నామన్నారు. అక్రమ నిల్వ చేయకుండా నిఘా పెడుతున్నామని చెప్పారు. అవసరానికి తగ్గట్టు ఎగుమతి, దిగుమతి పాలసీలను మార్చడం వంటి చర్యలు చేపడుతున్నామని వివరించారు. నిరుపేదలకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా ఆహార పదార్థాల పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతోందన్నారు.
భారత్ దాల్ పేరుతో సబ్సిడీపై శనగ పప్పును ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య బియ్యం ధరలను అదుపు చేసేందుకు బస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. దీంతో దేశీయంగా బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా గోధుమ దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలని కేంద్రం యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications