రైతులు కాదు పోకిరీలు, ఆకతాయిలు .. ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి
దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అన్నదాతల ఆందోళన సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిన్న జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి పోకిరీలు, ఆకతాయిలు అంటూ వ్యాఖ్యలు చెయ్యటం దుమారం రేపింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలకు నేడు క్షమాపణ చెప్పారు.
జంతర్ మంతర్ వద్ద రైతుల ఆందోళనపై మీనాక్షి లేఖ షాకింగ్ కామెంట్స్
ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా రైతులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు .జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న సమయంలో ఒక ప్రముఖ ఛానల్ కు చెందిన ఓ సీనియర్ వీడియో జర్నలిస్ట్ పై దాడి జరిగింది. ఆ దాడిపై మాట్లాడిన మంత్రి మీనాక్షి లేఖి రైతులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు రైతులు కాదు పోకిరీలు, ఆకతాయిలు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
మీనాక్షి లేఖి వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం ఫైర్... రాజీనామాకు డిమాండ్
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మీనాక్షి లేఖి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ రైతు వ్యతిరేక ఆలోచనా విధానంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమె "తక్షణ రాజీనామా" చేయాలని డిమాండ్ చేశారు. ఇక మీనాక్షి లేఖి వ్యాఖ్యలపై దుమారం రేగడంతో స్పందించిన మంత్రి తన మాటలు వక్రీకరించారని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టినట్లయితే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని వెల్లడించారు.
రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి
బిజెపి ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిన్న రైతుల నిరసనపై అడిగిన ప్రశ్నకు మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడుతూ, మీరు వారిని మళ్ళీ రైతులు అని పిలుస్తున్నారు, వారు రైతులు కాదు పోకిరీలు ఆకతాయిలు అంటూ నిప్పులు చెరిగారు. ఇక తాజా ఘటన జనవరి 26న రెడ్ ఫోర్ట్ లో జరిగిన హింసాత్మక ఘటనలను గుర్తు చేస్తున్నదని, ఇది సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షం ఇలాంటి కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. నిరసనకారులు కొంతమంది కుట్రదారుల ఆదేశాల మేరకు పని చేస్తున్నారని మీనాక్షి లేఖి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ సీఎం ఆగ్రహం .. ఆపై మంత్రి వ్యాఖ్యల ఉపసంహరణ
రైతులకు జంతర్ మంతర్ వద్ద కూర్చునే సమయం లేదని, ఆందోళన చేస్తున్న వారు రైతులే కాదని వ్యాఖ్యానించారు. వ్యవసాయం మానేసి ఆందోళన చేస్తున్నవారిని రైతులు అని ఎలా అంటాం అని ప్రశ్నించారు. రైతులపై "అవమానకరమైన భాష" ను ఉపయోగించినందుకు పంజాబ్ సిఎం ఆమెను టార్గెట్ చేశారు. ఆమె తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో, వెంటనే మంత్రి మీనాక్షి లేఖి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.