మరో కేంద్రమంత్రికి సోకిన కరోనావైరస్: జాగ్రత్తగా ఉండాలంటూ సూచన
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు ప్రముఖులను కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే దేశంలో పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా, మరో కేంద్రమంత్రికి కరోనా సోకింది. బుధవారమే తనకు కరోనా సోకినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేగికగా ఆయనే వెల్లడించారు. 'నాకు కరోనావైరస్ నిర్ధారణ అయ్యింది. రెండ్రోజులపాటు నాతో సన్నిహితంగా మెలిగినవారు తగు జాగ్రత్తలు తీసుకోండి' అని ప్రహ్లాద్ సింగ్ పటేల్ కోరారు.

కాగా, ఇప్పటి వరకు సుమారు 25 మందికిపైగా పార్లమెంటు సభ్యులు కరోనా బారిన పడ్డారు. మరోవైపు దాదాపు 50 మందికిపైగా పార్లమెంటు సిబ్బందికి కూడా ఈ మహమ్మారి సోకింది. దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపత్యంలో పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే వారందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. కేవలం నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే పార్లమెంటులోకి అనుమతిస్తున్నారు.
కరోనా బారినపడి బుధవారంనాడు చిత్తూరు జిల్లా తిరుపతి ఎంపీ, వైసీపీ నేత దుర్గాప్రసాద్ మరణించారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం భీమవరం. కాగా, ఎంపీ దుర్గాప్రసాద్ మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.
కాగా, దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 51,41,906 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
10,17,756 యాక్టివ్ కేసులున్నాయి. 40,39,986 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 83,432 మంది కరోనా బారినపడి మరణించారు.












Click it and Unblock the Notifications