రైతుల ఆందోళనల్లో పాకిస్థాన్, చైనాల పాత్ర: కేంద్రమంత్రి రావుసాహెబ్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ రావుసాహెబ్ దన్వే రైతుల ఆందోళనలపై సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనల్లో పాకిస్థాన్, చైనాల పాత్ర ఉందని ఆరోపించారు. ఇది రైతుల నిరసన కాదని, ఈ ఆందోళనల వెనుక పాకిస్థాన్, చైనాలున్నాయన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న తరుణంలో దేశంలోని ముస్లింలను వెళ్లగొడతారంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయని ఆయన మండిపడ్డారు. ఒక్క ముస్లింను కూడా వెళ్లిపోవాలని కేంద్రం చెప్పనప్పటికీ.. తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడేమో రైతుల ఆందోళనల్లో విదేశీ శక్తులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. రైతులకు మేలు చేసే చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళనలు చేయిస్తున్నాయని మంత్రి రావుసాహెబ్ ఆరోపించారు. రైతులకు మేలు జరిగే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గబోదని ఆయన స్పష్టం చేశారు.
రైతు సంఘాల ప్రతినిధులతో సుమారు ఆరు దఫాలుగా కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వ్యవసాయ చట్టాల రద్దుకే రైతు సంఘాల ప్రతినిధులు పట్టుబట్టడంతో చర్చలు సఫలం కాలేదు. రైతుల పంటలకు మద్దతు ధర ఉంటుందని, తాజాగా చేసిన చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది.
మరోవైపు రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రతిపక్షాలతో కలిసి ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను కలిసి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విన్నవించారు. రైతులను మోసం చేస్తోందని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. తమ భవిష్యత్తు కోసమే రైతులు పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications