2019 ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఉండదన్న కేంద్ర మంత్రి
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల తర్వాత భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉండకపోవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రానున్న లోక్సభ ఎన్నికల తర్వాత బలమైన ప్రభుత్వం ఏర్పాటుకాక పోవచ్చని వ్యాఖ్యానించారు. దేశం పెను మార్పు దిశగా పయనిస్తోందని ఇక మార్పు గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు.
అభివృద్ధి దిశగా దూసుకెళుతున్న భారత దేశంలో బలమైన ప్రభుత్వం రాకపోతే కచ్చితంగా ఆ ప్రభావం దేశంపై పడుతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పథంలో సాగుతున్న దేశానికి ఇది శుభ సూచకం కాదని అన్నారు. అందుకే తాము చేసిన అభివృద్ధిని ప్రజల చెంతకు తీసుకెళ్లి వివరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జయంత్ సిన్హా చెప్పారు. అయితే అది రిస్క్తో కూడుకున్నదని చెప్పారు. గత నెలలో జరిగిన మూడు ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన నేపథ్యంలో జయంత్ సిన్హా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదిలా ఉంటే 2019 లోక్సభ ఎన్నికలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారబోతున్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ హెచ్చరించారు. 2019 తర్వాత ఏప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రభావం తక్కువగా ఉండేలా చూడాలని ఆయన అన్నారు. జిందాల్ మాటలకు మద్దతు తెలిపిన ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్.... ఆర్థిక రంగం పై కూడా సీరియస్గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ ఆర్థిక రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎలాంటి పాత్ర పోషించాలో రానున్న ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలని కొటక్ అన్నారు.