అమ్మ కోలుకునేదాకా.. పగ్గాలు ఆ ఆరుగురు చేతుల్లోకి
చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో.. ప్రస్తుత పాలనా పర్యవేక్షణ కోసం ఆరుగురు సభ్యులతో కూడిన టీమ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. 13రోజులుగా ఆసుపత్రికే పరిమితమైన జయలలిత ఆరోగ్యంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుండగా.. ఆమె ఎప్పుడు కోలుకునేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన టీమ్ ప్రభుత్వ పరిధిలోని 54 విభాగాలను పర్యవేక్షించడానికి సిద్దమైంది. ఈ టీమ్ లో జయలలిత నిచ్చెలి శశికళా నటరాజన్, జయ నమ్మినబంటు చీఫ్ సెక్రటరీ షీలా బాలకృష్ణన్, ఆపద సమయంలో సీఎం పీఠాన్ని అధిష్టించి ఆ తర్వాత తప్పుకునే పన్నీర్ సెల్వం ఉన్నట్టు సమాచారం. వీరి ముగ్గురితో పాటు జయలలితకు అత్యంత నమ్మకస్తులైన ముగ్గురు సీఎంవో కార్యదర్శులు ఈ టీమ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఆరుగురి నిర్ణయం లేకుండా.. మరే మంత్రి ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇదిలా ఉంటే, జయలలితకు రక్తనాళాల్లో ఇన్ఫెక్షన్ సోకిన సంగతి తెలిసిందే. ఇందుకోసం బ్రిటన్ నుంచి ప్రత్యేక వైద్యుడిని రప్పించి చికిత్స అందిస్తున్నారు. జయలలిత చికిత్స పొందుతోన్న గదిలోకి ఒక్క శశికళకు మాత్రమే ప్రవేశం కల్పించడం గమనార్హం.
కాగా, సోమవారం నాడు ఉదయం జయలలితను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లిన పన్నీర్ సెల్వం శశికళతో భేటీ అయినట్టు తెలుస్తోంది. పన్నీర్ సెల్వంతో పాటు మరో ఇద్దరు మంత్రులు కూడా ఆ సమయంలో ఆయనతో ఉన్నట్టు సమాచారం. జయలలిత చికిత్స పొందుతోన్న వేళ రాష్ట్రంలో పాలనా విభాగాలను సమన్వయపరిచేందుకు శశికళతో పన్నీర్ సెల్వం భేటీ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications