ప్రేమించొద్దనందుకు ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు
లక్నో: ఎవరూ లేరని చేరదీసి పెంచిన పెంపుడు తల్లినే కూతురు హత్య చేసింది. చిన్న వయస్సులోనే ప్రేమ పేరుతో అబ్బాయిల వెంట తిరగకూడదని తల్లి హితవు చెప్పడమే ఆ బాలికకు కోపం తెప్పించింది. ప్రియుడి సహయంతో తల్లిని హత్య చేసింది . ఆ తర్వాత తనకు ఏమి తెలియనట్టుగా వ్యవహరించింది. అయితే చిట్టచివరకు పోలీసుల దర్యాప్తులో నిందితురాలు అసలు విషయాన్ని ఒప్పుకొంది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేహ్పూర్కు చెందిన ఏడోతరగతి చదువుతున్న బాలిక తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ళ బాలుడిని ప్రేమించింది.అయితే ఈ విషయం పెంపుడు తల్లికి తెలిసింది. ఎవరు లేకపోవడంతో ఈ బాలికను తల్లి దత్తత తీసుకొంది. అయితే చిన్న వయసులో ప్రేమ పేరుతో తిరగడం మంచిదికాదని తల్లి హెచ్చరించింది.
తమ ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని ఆ కూతురు భావించింది. తల్లిపై కక్ష పెంచుకొంది.తల్లి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ఆదివారం రాత్రి ప్రియుడికి సమాచారం అందించింది.
నిద్రలో ఉన్న తల్లిని ప్రియుడి సహయంతో గొంతు నులిమి చంపేసింది.ఫోన్లను పగులగొట్టింది. తెల్లవారిన తర్వాత ఏమి తెలియనట్టుగా పొరుగువారికి తన తల్లి అపస్మారకస్థితిలో ఉందని నమ్మించింది.
అయితే కూతురు వ్యవహరశైలిపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల విచారణలో నిందితురాలు అసలు విషయాన్ని బయట పెట్టింది. దీంతో నిందితులిద్దరిని కూడ జువైనల్ హోమ్కు తరలించారు.