ఆ కేంద్రమంత్రికి బిగ్షాక్: బీజేపీ 30 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే: డ్రీమ్గర్ల్కూ
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటంతో.. ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. అందులోనూ దేశ రాజకీయ స్థితిగతులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కూడా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోండటంతో అందరి దృష్టీ దీనిపై పడింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇదివరకే వెలువడింది. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ.
ఏడు దశల్లో 15 కోట్ల మంది ఓటర్లు..
తొలిదశ ఫిబ్రవరి 10వ తేదీన ఆరంభమౌతుంది. చివరి దశ పోలింగ్ మార్చి 7న ఉంటుంది. అదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపును నిర్వహించేలా షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘ. ఉత్తర ప్రదేశ్లో ఏడు దశల్లో పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో మొత్తంగా 15,05,82,750 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీనికోసం ఎన్నికల అధికారులు 1,74,351 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారం ఎవరిని వరిస్తుందనేది అదే నెల 10వ తేదీన తేటతెల్లమౌతుంది.
30 మంది స్టార్ క్యాంపెయినర్లు..
ఫిబ్రవరి 10వ తేదీన తొలిదశలో 58 స్థానాల్లో పోలింగ్ నిర్వహించడానికి సన్నాహాలను పూర్తి చేశారు. ఈ దశలో పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను గెలిపించుకోవడానికి బీజేపీ 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రస్తుతానికి తొలి దశ వరకు మాత్రమే పరిమితం చేసింది. మిగిలిన విడతల కోసం ఇందులో మార్పులు చేర్పులు చేస్తుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా.. ఆ ప్రాంతాల్లో పేరున్న నాయకులను ఇందులో చేర్చుతుంది.
మోడీ సహా..
ఈ తొలి విడత స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రాధా మోహన్ సింగ్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, స్మృతి ఇరానీ, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు చోటు లభించింది.
హేమమాలినీతో పాటు..
మధుర ఎంపీ, డ్రీమ్ గర్ల్ హేమా మాలిని, డాక్టర్ దినేష్ శర్మ, సంజీవ్ బల్యాన్, జశ్వంత్ సైనీ, అశోక్ కఠారియా, సురేంద్ర నగర్, జనరల్ వీకే సింగ్, చౌదరి భూపేంద్ర సింగ్, బీఎల్ వర్మ, రాజ్వీర్ సింగ్ రాజు భయ్యా, ఎస్పీ సింగ్ బెహల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, కాంతా కర్దమ్, రజినీకాంత్ మహేశ్వరి, మోహిత్ బేనివాల్, ధర్మేంద్ర కశ్యప్, జేపీఎస్ రాథోడ్, భోళాసింగ్ కఠీక్.. తొలి విడత స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్లు ఉన్నారు. వీరంతా 58 మంది అభ్యర్థుల కోసం ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Recommended Video
అజయ్ మిశ్రాకు షాక్..
కాగా- వివాదాస్పద కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తేనీకి బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. లఖీంపూర్ ఖేరీ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆయనకు ఈ జాబితాలో చోటు కల్పించలేదు. ప్రదర్శనలను నిర్వహిస్తోన్న రైతులపై జీపును డ్రైవ్ చేసిన కేసులో ఆయన కుమారుడు అరెస్టయిన నేపథ్యంలో- అజయ్ కుమార్ మిశ్రాను ఎన్నికల ప్రచారానికి దూరంగా పెట్టింది. ఆయన ప్రచారానికి వెళ్తే రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలకు సమాధానాలను ఇచ్చుకోవాల్సి వస్తుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది.