జనభా ఒక్కటే ఐనా! పాక్ కంటే యూపీ చాలా బెటర్: సీఎం యోగిపై పాక్ మీడియా ప్రశంసలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాకిస్థాన్ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో కరోనావైరస్ను సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని పాక్ ప్రముఖ పత్రిక 'డాన్' సంపాదకుడు ఫహద్ హుస్సేన్ కితాబిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ పేర్కొన్నారు.

పాక్ కంటే యూపీ చాలా బెటర్..
కరోనావైరస్ కట్టడి చేసేందుకు యోగి ప్రభుత్వం అవలంభించిన విధానం సరైందని, యూపీ ప్రభుత్వం లాక్డౌన్ను పటిష్టంగా అమలుపరిచినట్లు వెల్లడించారు. కరోనావైరస్ను ఎదుర్కొవడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందంటూ కథనాన్ని ప్రచురించిన మర్నాడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఫహాద్ హుస్సేన్ డాన్ పత్రిక ఇస్లామాబాద్ ఎడిషన్ రెసిడెంట్ ఎడిటర్గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పాక్ కంటే యూపీలోనే జనాభా ఎక్కువ.. అయినా..
దాదాపు పాకిస్థాన్ జనాభాతో సమానంగా(పాకిస్థాన్ జనాభా 20 కోట్లు కాగా, యూపీ జనాభా 22 కోట్లు) ఉన్న ఉత్తరప్రదేశ్లో కరోనా తీవ్రతను పోల్చిచూపారు.
పాక్లో కరోనా సంబంధిత మరణాల రేటు యూపీ కంటే ఏడు రేట్లు ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. పాక్ కంటే యూపీ కరోనా కట్టడిలో ఎంతో మెరుగైన విధానాన్ని అవలంభించిందని వ్యాఖ్యానించారు. దాదాపు 11 కోట్ల జనాభా కలిగిన మహారాష్ట్రలో మాత్రం కరోనా మరణాలు పాక్ కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఆ రాష్ట్రం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్లే అక్కడ వైరస్ అదుపులోకి రాలేదని అన్నారు. ఈ వైరస్ అడ్డుకట్ట వేయడంలో ఉత్తరప్రదేశ్ వ్యవహరించిన విధానం సరైందన్నారు.

యూపీ సమర్థంగా పనిచేస్తోంది..
పాక్, ఉత్తరప్రదేశ్లలో జనాభా, అక్షరాస్యత దాదాపు సమానం. అదే కరోనా మరణాలతో పోలీస్తే తక్కువ జనసాంద్రత కలిగిన పాక్లోనే యూపీ కంటే ఎక్కువ. యూపీలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. మా దేశంలో అలా లేదని డాన్ ఎడిటర్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడంలో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని ప్రభుత్వం విఫలమైందంటూ ‘మెసేజ్ విత్ మ్యాటర్' పేరుతో ఓ సంపాదకీయం రాసిన మర్నాడే.. ఫహాద్ ఈ మేరకు ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. కాగా, ప్రపంచంలో లక్షకుపైగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో పాక్ కూడా చేరింది. లక్షా మూడువేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2067 మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications