యూపీ: కుల సమీకరణాలు ఓట్లు రాలుస్తాయా?
ఉత్తరప్రదేశ్ దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలనే శాసిస్తాయి. రెండున్నరేళ్ల క్రితం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 80 స్థానాలకు 71 స్థానాలను బిజెపి గెలుపొందడం
లక్నో: ఉత్తరప్రదేశ్ దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలనే శాసిస్తాయి. రెండున్నరేళ్ల క్రితం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 80 స్థానాలకు 71 స్థానాలను బిజెపి గెలుపొందడం వల్లే కేంద్రంలో నరేంద్రమోడీ సర్కార్ పూర్తి మెజారిటీతో కొలువుదీరగలిగింది.
అంతటి మహత్తు కలదీ ఉత్తరప్రదేశ్. కుల, మత, ప్రాంతాల వారీగా ఓట్లడగడం రాజ్యాంగ విరుద్ధమని, శిక్షార్హమని ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పినా.. ప్రధాన పార్టీలన్నీ కుల, మత ప్రాతిపదికపైనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమరాంగణంలో వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి.
యాదవ్ - ముస్లిం, దళిత్ - ముస్లిం కాంబినేషన్లతో పదేళ్లుగా సాగిన అధికార రాజకీయాలకు చెక్ పెట్టేందుకు కమలనాథులు సైతం యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళితులను తమ అక్కున చేర్చుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే యూపీలోనే కుల రాజకీయాలు మెండు.
2012 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దించిన 220 రాజకీయ పార్టీల్లో అత్యధికం కుల ప్రాతిపదికన ఏర్పాటైనవే అంటే అతిశేయోక్తి కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రధాని నరేంద్రమోడీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. కానీ నాయకత్వం వ్యూహ రచనలో తప్పిదాలకు పాల్పడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తొలి నుంచి పార్టీకి సారథ్యం వహించిన నేతల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా అధి నాయకత్వం తమదైన శైలిలో వ్యూహాలు రూపొందిస్తూ ముందుకు సాగడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు.
కులాల వారీగా రాజకీయ సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు పార్టీని నమ్ముకుని పనిచేసిన వారిని విశ్వాసంలోకి తీసుకోవాలన్న వైఖరి కాన రాకపోవడంతో కిందిస్థాయి నేతలు దూరమవుతున్నారు. తొలిదశ పోలింగ్ దగ్గర పడుతున్నా పార్టీలో ఐక్యత సాధించలేకపోవడం కమలనాథులకు కష్టకాలమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

40 శాతానికి పైగా ఓబీసీలు.. 14 కోట్ల ఓటర్లు
ఉత్తరప్రదేశ్లో 40 శాతానికి పైగా గల ఓబీసీలు దశాబ్దాల తరబడి అధికార రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. 14 కోట్ల మంది గల ఓటర్లు ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగే వేలాది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. ఓబీసీల్లో 200 ఉపకులాలు ఉన్నాయి. వీరిలో 8 శాతంతో యాదవులు అధిక సంఖ్యలో ఉండగా, లోధీలు 7, జాట్లు 1.7, మౌర్య తదితర ఉపకులాలతో కూడిన కుశ్వాహా కులాలు 4, కుర్మీలు 3, సునార్ తదితర చిన్నకులాల వారు సుమారు 14 శాతం ఓబీసీల్లో ఉన్నారు.
అందరి లక్ష్యం ఓబీసీలు కాగా వారిలో అగ్రస్థానం యాదవులదే . సుదీర్ఘకాలంగా వీరు ములాయంకు అండగా ఉంటున్నారు. తాజాగా మిగతా ఓబీసీలను ప్రసన్నం చేసుకునేందుకు సీఎం అఖిలేశ్ 17 ఓబీసీ కులాలను ఎస్సీల జాబితాలో చేర్చి, కుల రాజకీయాలకు ఆజ్యం పోశారు. కానీ ఆయన నిర్ణయం చెల్లనేరదని న్యాయస్థానం కొట్టి పారేసింది అది వేరే సంగతి. రాష్ట్రంలో ఓబీసీలు, ఎస్సీల్లో పెద్దకులాలు ఏదో ఒక పార్టీకి ఓటేస్తాయి.
జయాపజయాలు నిర్ణయించే చిన్న కులాలు
ఆ రెండు ఆ వర్గాల్లో డజన్ల సంఖ్యలో ఉన్న చిన్న కులాలు ఈ ఎన్నికల్లో జయాపజయాలను నిర్ణయించనున్నాయి. ఇప్పుడు అన్ని పార్టీలు చిన్న కులాల ఓట్లపై గురిపెట్టాయి. ఓబీసీల్లో మల్లా కులానికి 4.5 శాతం ఓట్లున్నాయి. రాష్ట్రంలోని నదుల పరీవాహక ప్రాంతాల్లో నివాసం ఉండే ఈ కులాల వారికి 125 సీట్లలో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తారు.
నిషాద్ వర్గానికి చెందిన ఫూలన్ దేవి ఏకలవ్య పార్టీ ఏర్పాటు చేసి ఆ వర్గం హక్కుల కోసం పోరాడారు. 2001లో ఆమె హత్యకు గురికావడంతో ఆ కులం వారు సొంత పార్టీలు పెట్టుకుని ఆ ప్రాంతంలో అభ్యర్థుల జయాపజయాలను నిర్దేశిస్తున్నారు. ఇక నేతపని వారి ఓట్లు యూపీలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీరిని ఆకట్టుకునేందుకు ప్రధాని మోదీ గత ఏడాది ప్రత్యేక పథకాలను ప్రవేశ పెట్టారు. ఆ పథకాలు బీజేపీకి ఏ మాత్రం ఓట్లు రాలుస్తాయో వేచి చూడాలి.
అగ్రకులాల ఓట్ల పరిరక్షణకు కమలనాథుల పాట్లు
అగ్రకులాల వారూ సుమారు 25 శాతం మంది ఉంటారు. వీరిలో బ్రాహ్మణులు, ఠాకూర్లది సింహభాగం, వైశ్యులు, ఖత్రి, కాయస్త, త్యాగి, భూమిహార్లు స్వల్ప సంఖ్యలో ఉన్నారు. మొదటి నుంచి అగ్రవర్ణాల వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. బ్రాహ్మణులు, ఠాకూర్ల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బీజేపీ జాగ్రత్తపడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్భవన్ శృంగారలీలల వ్యవహారం తర్వాత రాజకీయాలకు దూరమైన యూపీ మాజీ సీఎం ఎన్డీ తివారీని పార్టీలోకి ఆహ్వానించడం బీజేపీ తన బ్రాహ్మణ ఓట్లను కాపాడుకునే వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు.
అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆయా సామాజిక వర్గాల నేతలను కమలనాథులను తమ అక్కున చేర్చుకోవడం తొలి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న శ్రేణులకు సుతారామూ ఇష్టం లేదు. రమారమీ 140 స్థానాల్లో ఇతర పార్టీల నుంచి చేరిన వారికి టిక్కెట్లు ఇవ్వడంపై స్థానిక నేతలతోపాటు పార్టీ కార్యకర్తలు కూడా రగిలిపోతున్నారు.
ఎస్సీలు 20 శాతం.. అంతా మాయాకు మద్దతే
యూపీలో 21.1 శాతం ఎస్సీ ఓట్లు ఉన్నాయి. వారిలో 66 ఉప కులాలున్నాయి. జాతవ్లు 11 శాతం, జాతవేతర దళితులు వాల్మికీలు, మలాహ్, పాసీలు 10 శాతం వరకు ఉన్నారు. వీటిలో ప్రధానంగా జాతవ్-చమర్, పాసీ, ధోబీ, కోరీ, వాల్మీకీ, ఖాటిక్ అనే ఉప కులాల వారు దళితుల్లో 87 శాతం మంది ఉన్నారు.
మిగిలిన 60 ఉపకులాల్లో ముసహర్, సపేరా, బాసర్, తాంత్వా తదితర కులాలకు చెందినవారు నామమాత్రపు సంఖ్యలో రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నారు. ఎన్నికల్లో వీరి ప్రభావం తక్కువే. దళితుల్లో ప్రధానమైన ఆరు ఉప కులాల్లో జాతివేతరులైన పాసీ, వాల్మీకి, ఖాటిక్లు సామాజికంగా, రాజకీయంగా హిందూత్వ వైపు మొగ్గు చూపుతారన్న అభిప్రాయం నెలకొంది. మెజారిటీ ఎస్సీలు మాయావతి పార్టీకి మద్దతు పలుకుతున్నారు. జాతవులు ఎంతో కాలంగా బీఎస్పీ వైపే ఉన్నారు.
143 సెగ్మెంట్లలో ముస్లింలు కీలకం
ఇక 19 శాతం వరకు ఉన్న ముస్లింలు సుమారు 143 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. బీజేపీని ఓడించే ప్రబల శక్తికే ముస్లింలు ఓటేస్తున్నారు. త్రిముఖ (బీఎస్పీ, బీజేపీ, ఎస్పీ) పోటీ మధ్య సాగే యూపీ ఎన్నికల్లో ప్రతీసారి ముస్లింలు రెండు ప్రధాన పార్టీల్లో ఏదో ఒక పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు.
ఎస్పీలో విభేదాలు సమసిపోవడంతోపాటు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కారణంగా ముస్లింల ఓటింగ్ చీలే అవకాశమే కనిపించడం లేదు. అయితే ఎస్పీ - కాంగ్రెస్ పొత్తుకు ధీటుగా బీఎస్పీ అధినేత అత్యధికంగా 97 మంది ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వడం గమనార్హం. ఎస్పీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్ ను ముస్లింలు తమ ముల్లా ములాయం అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆజంఖాన్ వంటి సీనియర్ నేతలు తొలి నుంచి ఆయనకు దన్నుగా నిలిచారు.
కుర్మీ ఓట్లపై బీజేపీ కన్ను
ఒబీసీలో మూడు శాతం ఉన్న కుర్మీలను ప్రసన్నం చేసుకునేందుకు వారి ఓట్ల కోసం ఆ వర్గం నాయకురాలు అనుప్రియ పటేల్కు మోదీ మంత్రి పదవి ఇచ్చారు. మౌర్య ఓటర్లను ఆకర్షించేందుకు బీఎస్పీ కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర నేత కేశవ్ ప్రసాద్ మౌర్యలను బీజేపీ పార్టీలోకి తీసుకుంది. కుర్మీ,మౌర్య కులాలు ఓబీసీల్లో ఎంతో కీలకమైనవి కావడంతో బీజేపీ ఆ కులాల నేతలను పార్టీలోకి ఆహ్వానించింది. బీజేపీతో పాటు ఎస్పీ కూడా ఈ కులాల నేతలకు రెడ్ కార్పెట్ ఆహ్వానం పలికింది. బీఎస్పీ అధినేత మాయావతి కూడా ఓబీసీ నేతలను బరిలోకి దించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కహర్, కుమ్హర్, నిషాద్, రాజ్బర్ సామాజిక వర్గాలకు గణనీయ ఓటుబ్యాంక్ ఉంది. వీరంతా 1990 తర్వాత హిందుత్వ మండల్, బహుజన్ నినాదాల మధ్య విడిపోయారు. పిఛ్డా వర్గ్ సమ్మేళన్ (బీసీ సదస్సు) పేరిట రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకటి చొప్పున 403 నియోజకవర్గాల పరిధిలో 200 ఓబీసీ సభలు నిర్వహించడం ద్వారా ఓబీసీల్లో తమ పట్టు పెంచుకునేందుకు ఒక అడుగు ముందుకేసింది.












Click it and Unblock the Notifications