విషాదం: సెప్టిక్ ట్యాంకులో పడిన బాలుడిని కాపాడబోయి ఐదుగురు మృతి
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంకులో పడిన చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఐదుగురు మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆగ్రా ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపూర్ గ్రామంలో పదేళ్ల బాలుడు అనురాగ్ ఆడుకుంటూ వెళ్లి ఇంటి సమీపంలోని సెప్టిక్ ట్యాంకులో పడిపోయాడు. బాలుడిని కాపాడేందుకు మరో నలుగురు వెళ్లి, వారు కూడా సెప్టెక్ ట్యాంకులో పడిపోయారు.
గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటికి తీసి సమీపంోలని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఈ ఐదుగురు కూడా మరణించారని వైద్యులు వెల్లడించారు. మరణించినవారిని అనురాగ్, సోను(12), రామ్ ఖిలాడీ హరిమోహన్(16), అవినాశ్(12)గా గుర్తించారు. కాగా, వీరిలో అవినాశ్, అనురాగ్, హరిమోహన్ సోదరులు కావడం గమనార్హం.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.