శిక్ష భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా..: హాథ్రస్ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిజ్ఞ
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్లో 19ఏళ్ల అమ్మాయి అత్యాచారం, దారుణ హత్యపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఇవ్వకుండా పోలీసులే దహనం చేయడంపైనా రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. యూపీలో ఆడపిల్లలకు రక్షణ లేదంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి.

శిక్ష భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా..
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటనం చేశారు. రాష్ట్రంలో ఆడపడుచుల భద్రత, వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోని తల్లులు, అక్కాచెల్లెమ్మలకు హాని కలిగించాలని భవింంచిన వారిని అత్యంత కఠినంగా శిస్తామని స్పష్టం చేశారు. ఆ శిక్ష భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండిపోయేలా చేస్తామన్నారు.

వారి రక్షణకు కట్టుబడి ఉన్నాం..
యూపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అందరు తల్లులు, బిడ్డల రక్షణకు కట్టుబడి ఉందని, ఇది తమ ప్రతిజ్ఞ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. కాగా, గురువారం హాథ్రస్ బాధితురాలి కుటుంబసభ్యులను వీడియో కాల్ ద్వారా సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు.

బాధిత కుటుంబానికి అండగా..
అంతేగాక, నిందితులందరికీ కఠినమైన శిక్షను విధిస్తామని బాధితురాలి కుటుంబసభ్యులకు సీఎం యోగి హామీ ఇచ్చారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. బాధితురాలి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం, ఇళ్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు.
Recommended Video

వరుస ఘటనలతో నిరసనలు
కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వరుసగా మహిళలు, యువతులపై దాడులు, హత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. హాథ్రస్లో 19ఏళ్ల యువతిపై హత్యాచారం జరిగిన రోజే మరో 11 ఏళ్ల బాలికపై కూడా మరికొందరు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతకుముందు కూడా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర నిరసనలు చేపట్టాయి. యూపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశాయి. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్, ప్రియాంక గాంధీ వాద్రాలను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. శుక్రవారం టీఎంపీలను కూడా అడ్డుకుని తిరిగి పంపించేశారు.












Click it and Unblock the Notifications