యూపీలో కరోనా కలకలం: 9 జిల్లాలకు జడ్జీలే నోడల్ అధికారులు, యోగి సర్కారుకు కీలక ఆదేశాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు నగరాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న 9 జిల్లాల్లో జుడీషియల్ అధికారులను ఆయా జిల్లాలకు నోడల్ అధికారులుగా నియమించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించింది.
తాము చెప్పిందే వేదం అన్నట్లుగా యోగి సర్కారు..
కేసుల ఉధృతి తీవ్రంగా ఉన్న జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారంలో ఉన్నవారు తాము చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించకూడదని, అందరి నుంచి సూచనలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారిపై దాఖలైన పిల్ను విచారించిన సందర్భంగా హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
తొమ్మిది జిల్లాలకు నోడల్ అధికారులుగా న్యాయమూర్తులు
తొమ్మిది జిల్లాల్లో నియమించబడే నోడల్ అధికారులు కోర్టు ఆదేశాలు, సూచనలు ప్రభుత్వానికి తెలియజేసి, వాటిని అమలయ్యే విధంగా చూడాలని స్పష్టం చేసింది. అంతేగాక, జిల్లాలో కరోనా పరిస్థితిపై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు హైకోర్టుకు నివేదించాలని జస్టిస్ సిద్ధార్థ వర్మ, అజిత్ కుమార్లతో కూడిన హైకోర్టు దర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలో యోగి సర్కారు కూడా నోడల్ అధికారులకు అన్ని వివరాలతో సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ 9 జిల్లాలకే నోడల్ అధికారులు.. ప్రతిరోజూ వివరాలు
కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంగా పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించాలని సూచించింది. గత కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పేర్కొంది. లక్నో, ప్రయాగ్రాజ్, వారణాసి, కన్పూర్ నగర్, ఆగ్రా, గోరఖ్పూర్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, ఝాన్సీ జిల్లాలకు సంబంధించిన జడ్జీలను నోడల్ అధికారులుగా ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఆస్పత్రుల్లో చోటు చేసుకుంటున్న ప్రతి మరణం, సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని నోడల్ అధికారులకు ప్రతి రోజు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
యూపీ ఎన్నికలపై సంఘంపై హైకోర్టు ఆగ్రహం
స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా రోగులకు ఆక్సిజన్ అందించలేని పరిస్థితి ఏంటని అసహనం వ్యక్తం చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కరోనా నిబంధనలకు ఎందుకు పాటించడం లేదని యూపీ ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి కరోనా సోకడం, పలువురు మరణించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మే 3 కు తదుపరి విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలేంటో తెలుపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Recommended Video