నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం: పీకలదాకా తాగి కారు నడిపిన మంత్రి కారు డ్రైవర్
ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కారు ఢీకొని సోమవారం రాత్రి బండి లాగే వ్యక్తి మృతి చెందాడు.
ఉతరప్రదేశ్: నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పీకదాకా తాగి ఆ మైకంలోనే ఓ మంత్రిగారి కారు డ్రైవర్ కారు నడపడం ఓ చావుకు కారణమైంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఓంకార్ సింగ్ యాదవ్ కారు డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది.
లక్నో జాతీయ రహదారిపై హర్దోయి ప్రాంతంలో సోమవారం రాత్రి బండి లాగే వ్యక్తిని అతివేగంగా వచ్చిన మంత్రి కారు ఒక్కసారిగా ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇది గమనించిన స్థానికులు ఆగ్రహించి జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు.

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలేసులు ఘటనాస్థలికి చేరుకుని మంత్రి కారు డ్రైవర్ ను అదుపులోనికి తీసుకున్నారు.అసలేం జరిగిందని వారు ఆరా తీయడంతో తాను మంత్రిగారి సంబంధీకులను బదౌన్ లో వదిలేసి తిరిగొస్తున్నానని, రహదారిపై చీకటి, మంచు కారణంగా సరిగా కనిపించక ప్రమాదం జరిగిందని అతడు చెబుతున్నాడు.
అయితే పోలీసులు డ్రైవర్ మాటలు విశ్వసించలేదు. మంత్రిగారి కారులో మద్యం సీసాలు లభించడంతో డ్రైవరే తప్ప తాగి కారు నడిపి ఉంటాడని, అందుకే ప్రమాదం జరిగి ఉంటుందని వారు భావిస్తున్నారు. అయితే అతడు మంత్రిగారి కారుకు డ్రైవర్ కావడంతో కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా జంకుతున్నారు.
మరోవైపు మృతుడి కుటుంబీకులు తమకు న్యాయం చేసి ఆదుకోవాలంటూ యూపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే ప్రమాదంజరిగిన సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడా? లేక మంత్రిగారు కూడా ఉన్నారా? అన్నదానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లభించడం లేదు.












Click it and Unblock the Notifications