షాకింగ్:లేడీ పోలీస్పై సీఐ రేప్ -మళ్లీ రావాలంటూ బలవంతం -యోగి సంచలన ఆదేశాలిచ్చిన గంటల్లోనే..
క్రైమ్ క్యాపిటల్ స్టేట్ ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. అసాంఘిక శక్తుల బారి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన పోలీసు అధికారే తోటి మహిళా పోలీసుపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకుని, రేప్ సంగతిని బయటికి చెబితే చంపేస్తానని బెదిరించి, మళ్లీ మళ్లీ అది కావాలంటూ బలవంతపెట్టాడు. అత్యాచార నిందితులకు సంబంధించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆదేశాలిచ్చిన గంటల వ్యవధిలోనే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఆమె స్పెషల్ పోలీస్ ఆఫీసర్
పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పోలీస్ సిబ్బంది కొరతను అధిగమించేలా, అదే సమయంలో తక్కువ చదువున్న అమ్మాయిలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం అఖిలేశ్ యాదవ్ (2016లో) ‘పవర్ ఏంజిల్స్'పేరుతో సరికొత్త ఇనిషియేటివ్ తీసుకున్నారు. అందులో భాగంగా 2 లక్షల మంది యువతులకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్(ఎస్పీవో) ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినా, ఇప్పటివరకు దాదాపు 1లక్ష మందికి ఉపాధి కల్పించారు. ఆయాన జిల్లాల పరిధిలోని స్టేషన్లలోనే డ్యూటీలు చేస్తూ, పోలీసులకు అన్ని రకాలుగా సహాయపడటం ఎస్పీవోల విధి. సింపుల్ గా చెప్పాలంటే యూపీలోని ఎస్పీవోలు.. మన తెలుగు రాష్ట్రాల్లోని హోంగార్డుల వంటివారన్నమాట. ఉద్యోగ భద్రత విషయంలో ఆ యువతుల నిస్సహాయతను ఆసరగా చేసుకుని సొంత శాఖలోని పోలీసులే వేధింపులకు పాల్పడుతోన్న వైనాలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. తాజా కేసులోనూ బాధితురాలు ఎస్పీవోనే కావడం గమనార్హం..

కేసు ఫైల్తో హోటల్కు రమ్మని..
ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్కి చెందిన రాకేష్ యాదవ్ క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఓ విడాకుల కేసును డీల్ చేస్తున్న క్రమంలో.. కేసు తాలూకు వ్యక్తులు.. తన కింద పని చేసే మహిళా ఎస్పీవో బంధువులేనని సీఐ గుర్తించాడు. సదరు కేసు నమోదైన సానిగంజ్ పోలీస్ స్టేషన్ లోనే ఆ మహిళా పోలీస్ పనిచేస్తుండటం, ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన కీచకుడు.. అక్టోబర్ 29న ఫోన్ చేసి, కేసు ఫైల్ ను తీసుకుని హోటల్ కు రావాల్సిందిగా ఆదేశించాడు. ఎప్పుడూ బిజీగా ఉండే క్రైమ్ బ్రాంచ్ అధికారి కావడంతో నిజంగానే తీరిక దొరకలేదేమో అనుకుని మహిళా ఎస్పీవో హోటల్ కు వెళ్లింది. అక్కడ..

రేప్ చేసి.. మళ్లీ రావాలని ఫోర్స్..
కేసు ఫైలుతో హోటల్ గదికి వచ్చిన మహిళా పోలీసుపై కీచక సీఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించినా అతని మృగబలం ముందు నిస్సహాయురాలైపోయింది. అత్యాచారం తర్వాత ఆమెను పంపిస్తూ, జరిగిన సంగతి ఎవరికైనా చెబితే ప్రాణాలు తోడేస్తానని బెదిరించాడు. దీంతో దారుణాన్ని తనలోనే దాచుకుంది కుమిలిపోయిందా మహిళ. వారం తిరిగేలోపే సీఐ రాకేశ్ యాదవ్ బాధితురాలికి మళ్లీ ఫోన్ చేసి కోరిక తీర్చాల్సిందిగా ఆదేశించాడు. అందుకామె నో చెప్పడంతో ఇంకా రెచ్చిపోయి పదే పదే ఫోన్లు చేస్తూ, అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతూ కీలచక పర్వాన్ని కొనసాగించాడు. సీఐ వేధింపులు తారా స్థాయికి చేరడంతో బాధితురాలు గత శుక్రవారం జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఈ చర్యతో..

పరారీలో సీఐ.. సస్పెన్షన్ ఉత్తర్వులు..
మహిళా ఎస్పీవో తెగించి ఫిర్యాదు చేస్తుందని ఊహించలేకపోయిన సీఐ రాకేశ్ యాదవ్.. తనపై కేసు నమోదైందన్న విషయం తెలియగానే అజ్ఞాతంలోకి జారుకున్నాడు. అలీగఢ్ జిల్లా సీనియర్ ఎస్పీ మునిరాజ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐపై కేసు నమోదుతోపాటు అతణ్ని సస్పెండ్ కూడా చేశామన్నారు. పరారీలో ఉన్న రాకేశ్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. కాగా, అత్యాచార నిందితులపై యూపీ సర్కారు సంచలన ఆదేశాలచ్చిన గంటల వ్యవధిలోనే మహిళా పోలీసులపై సీఐ ఘటన వెలుగులోకి రావడం కీలకంగా మారిందిలా..

రేప్ కేసుల్లో నిందితుల ఆస్తులు జప్తు..
ఉత్తరప్రదేశ్ లో పండు ముసలి నుంచి పసిపాపదాకా అన్ని వయసులవాళ్లపై అత్యాచారాలు జరుగుతుండటం, చాలా కేసుల్లో నిందితులు పరారైపోయి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటుండటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో యోగి సర్కార్ సంచలన రీతిలో అత్యాచార నిందితుల ఆస్తుల జప్తునకు ఇటీవలే ఆదేశాలిచ్చింది. రేప్ కేసుల్లో నిందితులుగా ఉన్నవాళ్లు పోలీసులకు చిక్కకుండా, కోర్టులకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నట్లయితే, వాళ్లకు చెందిన ఇళ్లు, ఆస్తులను పోలీసులే స్వాధీనం చేసుకునే ప్రక్రియను మొదలుపెట్టారు. సీఆర్పీసీ సెక్షన్ 83 ప్రకారం తీసుకొచ్చిన తాజా ఉత్తర్వులను తొలిసారిగా గత వారమే అమలు చేశారు. బరేలీ జిల్లాలో ఓ మైనర్ బాలికను రేప్ చేసి తప్పించుకు తిరుగుతోన్న నవీన్ కుమార్ అనే నిదితుడి ఆస్తులను పోలీసులు జప్తు చేశారు. తాజాగా మహిళా పోలీసుపై అత్యాచారం ఘటనలోనూ నిందితుడైన సీఐ రాకేశ్ పరారీలో ఉన్నాడు. నిర్ణీత వ్యవధి తర్వాత రాకేశ్ పైనా ఇలాంటి చర్యలే తీసుకుంటారా? లేదా? అనేది తెలియాల్సిఉంది.












Click it and Unblock the Notifications