ఘరానా మోసం.. 7లక్షల మంది బురిడీ.. 3700కోట్లు దోచుకున్న సంస్థ
కంపెనీ మోసాన్ని గుర్తించలేక సుమారు ఏడు లక్షల మంది ఖాతాదారులు ఒక్కొక్కరు రూ.57,500 చెల్లించారు.
లక్నో: నోయిడాలోని అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ సుమారు ఏడు లక్షల మందిని బురిడీ కొట్టించింది. ఆన్ లైన్ ద్వారా సులువుగా డబ్బులు సంపాదించవచ్చని లక్షల మందికి ఆశజూపిన సంస్థ.. వారందరితో డబ్బులు కట్టించుకుని మోసానికి పాల్పడింది.
అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీకి అనుబంధంగా తమ సంస్థ వెబ్ పోర్టల్స్ నిర్వహిస్తోందని.. వాటిల్లో సభ్యులుగా చేరితే ఒక్కో క్లిక్ కు రూ.5 సంపాదించవచ్చంటూ చాలామందికి గాలం వేసింది. ఖాతాదారులుగా చేరేందుకు రూ.57,500 రుసుం చెల్లించాలని, ఇదే వారి పెట్టుబడి అని తెలిపింది.
కంపెనీ మోసాన్ని గుర్తించలేక సుమారు ఏడు లక్షల మంది ఖాతాదారులు ఒక్కొక్కరు రూ.57,500 చెల్లించారు. అనంతరం ప్లేటు ఫిరాయించిన కంపెనీ ఖాతాదారులను మోసం చేసింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారు దర్యాప్తు చేపట్టారు. కంపెనీ ప్రతినిధులు ఖాతాదారుల నుంచి రూ.3700కోట్లను పెట్టుబడిగా వసూలు చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ప్రధాన నిందితులు ముగ్గురిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితులు తరచు కంపెనీ పేరు మారుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారని, అయినప్పటికీ సమర్ధవంతంగా వారిని పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు.