యూపీలో శాంతి భద్రతలు అప్పుడు అధ్వాన్నం.. ఇప్పుడెంతో మెరుగు: యోగిపై అమిత్ షా ప్రశంసలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గతంలోని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) ప్రభుత్వాల హయాంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా ఉండేదని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టారో నాటి నుంచే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు మెరుగయ్యాయని స్పష్టం చేశారు.
సహరాన్పూర్లోని పున్వర్కా గ్రామంలో కేంద్రమంత్రి, యూపీ ఎన్నికల ఇంఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం దినేష్ శర్మ తదితరుల సమక్షంలో గురువారం మా శాకుంభరి యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు.
'టీవీలో అఖిలేష్ యాదవ్ స్పీచ్ వింటున్నాను.. నేరాలు పెరిగిపోయాయని అంటున్నాడు.. అఖిలేష్ జీ.. మీరు ఎలాంటి కళ్లద్దాలు వాడతారు?.. ఐదేళ్ల ఎస్పీ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ హయాంలో శాంతిభద్రతలను పోల్చి చూసేందుకు గణాంకాలు తీసుకొచ్చాను' యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దోపిడీ 70 శాతం తగ్గిందని అమిత్ షా తేల్చి చెప్పారు.
"ఉత్తరప్రదేశ్లో ఆయుధాల వినియోగం ద్వారా దోపిడీ సంఘటనలు 69 శాతం తగ్గాయి. హత్యలు 30 శాతం తగ్గాయి. వరకట్న మరణాలు 22.5 శాతం తగ్గాయి." ఇంటికి వెళ్లి డేటాను తనిఖీ చేయాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్కు ఆయన ఉద్బోధించారు. "మీ పాలనలో, ఉత్తరప్రదేశ్లో మాఫియా పాలన ఉంది, నేడు రాష్ట్రంలో చట్టాలు ఉన్నాయి" అని అమిత్ షా చురకలంటించారు.
ఆడపిల్లలకు భద్రత కల్పిస్తున్న యోగి ప్రభుత్వాన్ని కొనియాడిన అమిత్ షా, ఒకప్పుడు ఇక్కడ అల్లర్లు జరగడమే కాకుండా మన కూతుళ్లను కూడా చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు పంపాల్సి వచ్చిందని అన్నారు. నేడు, పశ్చిమ యూపీలో ఏ కుమార్తె చదువుల కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. వారితో దురుసుగా ప్రవర్తించే సాహసం ఎవరూ చేయరు' అని అమిత్ షా.. యోగి పాలనను కొనియాడారు.
పశ్చిమ యూపీలో అక్రమ కబేళాల మూసివేత అనేది రాష్ట్రంలో పటిష్టమైన శాంతిభద్రతలను నెలకొల్పుతూ మత అల్లర్లను అరికట్టడానికి యోగి ప్రభుత్వానికి సహాయపడిందని షా అన్నారు. పశ్చిమ యూపీలో గోహత్య, అక్రమ కబేళాల మూసివేత సమస్యను అమిత్ షా బుద్ధిపూర్వకంగా తీసుకువచ్చారు.
2017 అసెంబ్లీ ఎన్నికలలో పశ్చిమ యూపీలోని 136 స్థానాల్లో 109 స్థానాలను బీజేపీ గెలుచుకోవడంలో అక్రమ కబేళాల మూసివేత ఆధిపత్యం చెలాయించింది. 2017 ఎన్నికలకు ముందు, అమిత్ షా పరివర్తన్ యాత్రను చేపట్టడం ద్వారా బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించారు, పార్టీ అధిక మెజార్టీతో విజయం సాధించింది. అయితే, అమిత్ షా, ఆదిత్యనాథ్ల గురువారం ర్యాలీ భిన్నంగా ఉంది, ఎందుకంటే, ఇప్పుడు పశ్చిమ యూపీ సుదీర్ఘ రైతుల ఆందోళన కారణంగా అధికార పార్టీకి కొంత ప్రతికూలంగా మారిందని చెప్పవచ్చు.
షామ్లి జిల్లాలోని కైరానా పట్టణం నుంచి వెళ్లిపోయిన హిందు కుటుంబాలు తిరిగి వచ్చేందుకు తగిన విధంగా చర్యలు తీసుకున్నామని, వారి భద్రతకు బాధ్యత తమదేనని షా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు వీరి బాధలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ ప్రాంతంలోని చక్కర రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. బీఎస్పీ పాలనలో జరిగిన చక్కర మిల్లుల అమ్మకం వ్యవహారంపై సీబీఐ విచారణ జరుపుతామన్నారు. ఇప్పటికే 90 శాతం రైతులకు చెల్లింపులు చేయడం జరిగిందని, మరో 10 శాతం రైతులకు త్వరలోనే చెల్లింపులు చేస్తామన్నారు.
Recommended Video
గత ప్రభుత్వాలు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమని అమిత్ షా వ్యాఖ్యానించారు. యోగి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని షా అన్నారు. ఆయోధ్యలో రామమందిరం నిర్మాణం హామీని ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణాలు, అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చట్టం లాంటి ఎన్నో సంస్కరణలు చేసిందని షా వివరించారు.