స్కూల్ బస్సును ఢీకొన్న రైలు: ఏడుగురు చిన్నారులు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల విద్యార్థులతో బయలుదేరిన ఓ స్కూల్ బస్సును వేగంగా దూసుకువచ్చిన రైలు బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 19మంది విద్యార్థులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని భడోహీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాపలా లేని రైల్వే గేటు కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
వేగంగా దూసుకువస్తున్న రైలును అంతగా గుర్తించని స్కూల్ బస్సు డ్రైవర్ రైల్వే పట్టాలను దాటించేందుకు యత్నించాడు. అయితే పట్టాలు దాటేలోగానే వేగంగా దూసుకువచ్చిన రైలు స్కూల్ బస్సును ఢీకొట్టేసింది.
బస్సు డ్రైవర్.. రైలును గమనించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.