హిందూ రాజ్యంగా ఉత్తర్ ప్రదేశ్..? యోగీ సర్కార్ ప్రత్యేక ఆదేశాలు దేనికి సంకేతం..!
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని హిందూ రాష్ట్రంగా చూపించే ప్రయత్నం సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేస్తున్నారా.. అని అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ప్రభుత్వం తరపునుంచి 75 మంది జిల్లా కలెక్టర్లకు, డివిజినల్ కమిషనర్లకు ఓ సర్కులర్ జారీ కావడం ఇందుకు బలం చేకూరుస్తోంది. అష్టమి,శ్రీరామ నవమి పండగలను పురస్కరించుకుని యోగీ సర్కార్ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలంటూ కలెక్టర్లకు అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. మార్చి 22 నుంచి మార్చి 30 వరకు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అందులో ఉంది.
గతంలో ప్రభుత్వాలు పలు మతపరమైన పండుగల సందర్భంగా సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించేందుకు పాలనాపరమైన అనుమతులతో పాటు అవి సవ్యంగా సాగేలా మద్దతు ఇచ్చేవి. అయితే తొలిసారిగా శ్రీరామ నవమి పండగను పురస్కరించుకుని యోగీ సర్కార్ ప్రతి జిల్లా కలెక్టర్కు అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. మోక్షం లభించాలంటే ఆత్మను పవిత్రంగా ఉంచాలని ఇందుకు చైత్ర నవరాత్రి సరైన సమయం అని పేర్కొంది. అంతేకాదు ఈ సమయంలోనే తొమ్మిది రూపాల్లో ఉన్న దుర్గామాతను పూజిస్తారని స్పష్టం చేసింది. వేదాల్లో పురాణాల్లో ఇదే ఉందని చెబుతూ ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది.

ఈ కార్యక్రమాలు ఏ ఆలయాల్లో నిర్వహించాలో వాటిని గుర్తించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లో కలెక్టర్లను కోరడం జరిగింది.ఇక సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు కళాకారులను గుర్తించాలని కోరింది.ఇందుకోసం రాష్ట్ర ఖజానా నుంచి ప్రతి జిల్లాకు రూ.లక్ష కేటాయించడం జరిగింది. అదే సమయంలో జిల్లా ఖజానా నుంచి అదనంగా నిధులు వినియోగించుకోవాల్సిందిగా సూచించింది. ఈ వేడుకలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలంటూ సమాచార శాఖకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.
అయితే యోగీ ఆదిత్యనాథ్ తీసుకున్న ఈ నిర్ణయంపై పలు వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యోగీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో హిందుత్వాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తున్నారని పలువురు మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి యోగీ ఆదిత్యనాథ్ హిందూ మఠం (గోరఖ్నాథ్ మఠం) బాధ్యతలు తీసుకోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అయితే గోరఖ్నాథ్ మఠంకు ఇటు భారత్లోనే కాకుండా అటు నేపాల్ నుంచి కూడా భక్తులు ఉన్నారు.












Click it and Unblock the Notifications