ఈ రాత్రికే భారత్ కు అమెరికా బృందం.. రేపే చర్చలు ప్రారంభం..!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్ పై అక్కసుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ పై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. ఆగస్టు 27 నుంచి భారత వస్తువులపై 50 శాతం టారిఫ్ లు అమలవుతూ వస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ట్రేడ్ వార్ ను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు భారత్- అమెరికా వాణిజ్య చర్చల్లో సెప్టెంబర్ 16న కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అమెరికా చీఫ్ నెగోషియేటర్ బ్రెండాన్ లించ్ తో పాటు పలువురు వాణిజ్య అధికారులతో కలిసి సెప్టెంబర్ 15 రాత్రికి భారత్ కు చేరుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందు భారత్ పై ట్రంప్ కన్నెర్ర చేస్తూ వచ్చారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని ఖండించారు. రష్యా చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.
ఈ క్రమంలో తొలుత భారత్ పై అమెరికా 25 శాతం టారిఫ్ లు విధించింది. ఆ తర్వాత ఆ సుంకాలను మరో 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే గతవారం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో వాణిజ్య చర్చలు జరిపేందుకు అమెరికా రెడీగా ఉందన్నారు. ప్రధాని మోదీ తనకు మంచి ఫ్రెండ్ అని ఇండియాతో వాణిజ్యం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య ట్రేడ్ చర్చలను ఓ కొలిక్కి తీసుకొస్తామని ట్రంప్ తెలిపారు.

ఆ తర్వాత ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ స్వాగతించారు. అమెరికాతో వాణిజ్యం చేసేందుకు తాము కూడా ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. భారత్- అమెరికా మధ్య పాజిటివ్, వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications