బాలికల కోసం అద్దిరిపోయే స్కీం: రూ.1,050 కోట్లతో..
ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం బాలికా సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వారికోసం ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించింది.
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బాలికా సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వారికోసం ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించింది. బడ్జెట్ విలువ 1,050 కోట్ల రూపాయలు. ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సురేష్ కుమార్ ఖన్నా.. ఈ పథకాన్ని 2023-2024 బడ్జెట్ ప్రతిపాదనల్లో పొందుపరిచారు.
ఇటీవలే ఆయన రాష్ట్ర బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో బాలికా సంరక్షణ కోసం ప్రత్యేకంగా కన్యా సుమంగళ యోజన పథకాన్ని ప్రకటించారు. ఈ పథకానికి 1,050 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. దీని కింద కుమార్తెలు ఉన్న ఒక్కో కుటుంబానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తుంది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.

ఆరు విడతల్లో లబ్దిదారులు ఈ మొత్తాన్ని అందుకుంటారు. బాల్యంలో వ్యాక్సినేషన్ ను పూర్తి చేసుకున్నప్పుడు, 1, 5, 9 తరగతుల్లో చేరినప్పుడు, గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకున్నప్పుడు.. ఇలా ఆరు విడతల్లో యోగి ప్రభుత్వం వారికి 15,000 రూపాయల మొత్తాన్ని చెల్లిస్తుంది.
ఈ పథకం కింద ఇప్పటికే 1.25 లక్షల మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. లబ్దిదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవడానికి యోగి సర్కార్.. ప్రత్యేకంగా వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కన్యా సుమంగళ యోజన కింద ఆర్థిక సహాయాన్ని పొందాలనుకునే వారు ఉత్తర ప్రదేశ్ లో శాశ్వత చిరునామాను కలిగి ఉండాలి. ఆ కుటుంబంలో ఇద్దరు కుమార్తెలకు మించి ఉండకూడదు. వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయల లోపే ఉండాలి. కవలలకు కూడా వర్తింపజేసింది ప్రభుత్వం.
కవలలతో పాటు మూడో ఆడబిడ్డకు కూడా కన్యా సుమంగళ పథకానికి అర్హురాలే అవుతుందని తెలిపింది. ఈ పథకంతో పాటు మహిళల కోసం అమలు చేస్తోన్న వేర్వేరు పథకాల కింద 4,032 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో సామూహిక వివాహాలను నిర్వహించడానికి 600 కోట్ల రూపాయలు, మ్యారేజ్ గ్రాంట్ స్కీమ్ కింద లబ్దిదారులకు ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి మరో 150 కోట్ల రూపాయలను యోగి ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్ లో కేటాయించింది.












Click it and Unblock the Notifications