కొండా సురేఖ vs కడియం వ్యవహారం లో బిగ్ ట్విస్ట్..!!
కొండా సురేఖ - కడియం శ్రీవారి వివాదం కొత్త మలుపు తీసుకుంది. కొంత కాలంగా ఇద్దరి మధ్య జిల్లా రాజకీయాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాజాగా కడియం నిర్వహించిన రివ్యూల పైన ఆగ్రహంతో ఉన్న కొండా సురేఖ నేరుగా ఏఐసీసీకి లేఖ రాసింది. తన శాఖ పైన కడియం ఎలా సమీక్ష చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ వ్యాఖ్యలకు కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
వరంగల్ కాంగ్రెస్ రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. నేతల మధ్య వర్గ పోరు తారా స్థాయికి చేరుతోంది. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఏఐసీసీసీకి లేఖ రాయడం రాజకీయంగా సంచలనంగా మారింది. తనకు సమాచారం లేకుండా, తన పరిధిలోని దేవాదాయ శాఖపై కడియం శ్రీహరి అధికారిక సమీక్ష నిర్వహించారన్నది సురేఖ ప్రధాన ఆరోపణ. అయితే, ఈ ఫిర్యాదుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంతే ఘాటుగా స్పందించారు. కొందరు కాంట్రవర్సీలు చేస్తూనే ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నారంటూ మంత్రి కొండా సురేఖ పేరు ఎత్తకుండానే పరోక్షంగా చురకలు అంటించారు. సురేఖ లేఖ వ్యవహారం పైన మాత్రం స్పందించలేదు.

పార్టీ నేతల వివాదాలపై హైకమాండ్ ఆరా
బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో సమావేశం కావడం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ సమీక్ష పైన మంత్రి కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేసారు. మంత్రిగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా కడియం సమీక్ష జరిపారని ఆరోపించారు. దేవాలయాల అభివృద్ధి, మాస్టర్ ప్లాన్లు, భూముల పరిరక్షణ, నిధుల కేటాయింపులపై అధికారులకు గడువులు విధించడం మంత్రి అధికారాలను బేఖాతరు చేయడమేనని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ, పార్టీ క్రమశిక్షణా కమిటీ స్థాయిల్లో దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సురేఖ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications