దారుణం... గర్భంతో ఉన్న భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన భర్త... విడాకుల కోసమే...
ఉత్తరప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. ఎలాగైనా భార్యను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో ఓ భర్త తన భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆమె గర్భంతో ఉందన్న కనికరం కూడా లేకుండా ఈ దారుణానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులతో కలిసి కుట్రపూరితంగా ఈ చర్యకు పాల్పడ్డాడు. ఆమె అనారోగ్యాన్ని సాకుగా చూపించి విడాకులు పొందే ప్రయత్నం చేశాడు.
వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కి చెందిన ఓ యువతికి గతేడాది డిసెంబర్ 7న అదే పట్టణానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది.పెళ్లి సమయంలో అతనికి రూ.12లక్షలు నగదుతో పాటు రూ.25 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చారు. అయితే పెళ్లయి అత్తగారింట్లో అడుగుపెట్టడమే ఆలస్యం నవ వధువుకు ఊహించని షాక్ తగిలింది. కాంట్రాక్ట్ హెల్త్ కేర్ వర్కర్గా పనిచేస్తున్న తన భర్తకు అదే డిపార్ట్మెంట్లో పనిచేసే ఓ మహిళతో సంబంధం ఉందని తెలిసింది.
ఈ విషయంపై భర్తను నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కొద్దిరోజులకు భర్త ఏదో విధంగా ఆమెకు నచ్చజెప్పాడు. ఇంతలో భర్త సోదరుడు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీనిపై నిలదీసినందుకు అత్తింటివారు ఆమెను చితకబాదారు.ఇదే క్రమంలో భార్యను ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో భర్త,అతని తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు కలిసి ఓ కుట్రకు ప్లాన్ చేశారు.
అప్పటికే ఆమె గర్భం దాల్చింది. వైద్య పరీక్షల నిమిత్తం భర్త ఆమెను ఓ నర్సింగ్ హోమ్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే ఆ ఇంజెక్షన్ హెచ్ఐవి ఇంజెక్షన్. భర్త,అతని కుటుంబ సభ్యులు కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారు.అప్పటినుంచి ఆమె అనారోగ్యంపాలైంది. అత్తింటివారి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఆమె తల్లిదండ్రులు అత్తింటివారిని నిలదీయగా... ఇక మీ బిడ్డను మేము భరించలేం... తీసుకెళ్లండన్నారు. పైగా ఆమెకు ఏదో రోగం అంటిందని... అనారోగ్యం బారినపడిందని అన్నారు.భర్త కూడా ఆమె అంటే తనకు ఇష్టం లేదని... తనకు విడాకులు కావాలని డిమాండ్ చేశాడు.
నిన్న,మొన్నటివరకూ ఆరోగ్యంగా ఉన్న తమ కూతురు ఉన్నట్టుండి అనారోగ్యం బారినపడటం ఆమె తల్లిదండ్రులకు అనుమానం కలిగేలా చేసింది. అసలు విషయం తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కుట్రలో మహేశ్, అతని తల్లిదండ్రులతో పాటు నర్సింగ్ హోమ్ యజమాని కూడా భాగస్వామేనని ఆ అమ్మాయి తండ్రి ఆరోపించారు. అతని సహకారంతోనే తన కూతురికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చారని ఆరోపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.