కొత్త ముఖ్యమంత్రికి కరోనా: ఢిల్లీ టూర్ క్యాన్సిల్: మోడీపై ఆ కామెంట్స్ చేసిన మరుసటి రోజే
డెహ్రాడున్: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ కథ మళ్లీ మొదటికొచ్చిందనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. రోజురోజుకూ కరోనా వైరస్ కట్టలు తెంచుకుంటోంది. సరిగ్గా ఏడాది కిందట దాని విజృంభణ ఏ స్థాయిలో ఆరంభమైందో.. అవే తరహా పరిస్థితులు మళ్లీ నెలకొంటున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. కొత్త కేసులు అదే స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా ప్రారంభ రోజుల తరహాలోనే ఇప్పుడు కూడా మహారాష్ట్రలో వేలసంఖ్యలో కేసులు పుట్టుకొస్తున్నాయి.
సెల్ఫ్ ఐసొలేషన్లో సీఎం
ఈ పరిణామాల మధ్య ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో ఆయన సెల్ఫ్ ఐసొలేషన్లో ఉంటున్నారు. తనకు కరోనా వైరస్ సోకందనే విషయాన్ని తీరథ్ సింగ్ రావత్ వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ట్వీట్ చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందనక్కర్లేదని చెప్పారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని త్రివేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు.

కరోనా తీవ్రతకు అద్దం పట్టేలా..
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఎయిమ్స్ ఛైర్ పర్సన్ డాక్టర్ ఆర్తీ విజ్ వెల్లడించారు. తాజాగా తీరథ్ సింగ్ రావత్ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. దేశంలో అడ్డు, అదుపు లేకుండా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయనడానికి ఈ రెండు సంఘటనలు అద్దం పడుతున్నాయి.

ఇటీవలే ప్రమాణ స్వీకారం..
తీరథ్ సింగ్ రావత్.. కొద్దిరోజుల కిందటే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారిగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన సందర్భంగా ఆయన పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ అగ్ర నాయకులను కలుసుకోవాల్సి ఉంది. ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఇక ఢిల్లీ పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. మళ్లీ ఎప్పుడు పర్యటిస్తారనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
మోడీ తప్ప మరెవరూ కరోనాను కంట్రోల్ చేయలేరంటూ..
ఇదిలావుండగా- ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ తీరథ్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మనదేశాన్ని అమెరికా 200 ఏళ్ళు పాలించిందని, ఇప్పుడు కరోనా వైరస్ను అదుపు చేయలేక సతమతమవుతోందంటూ వ్యాఖ్యానించారు. కరోనాను మోడీ తప్ప మరెవరూ కంట్రోల్ చేయలేరంటూ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఆయనకు పాజిటివ్ రిపోర్ట్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు చిరిగిన జీన్స్ పై ఆయన అనూహ్య వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడింది.












Click it and Unblock the Notifications