ఉత్తరాఖండ్ లో స్టార్ క్యాంపెయినర్స్ : ప్రధాని - షా తో సహా : 11న కీలక సభ...!!
ఉత్తర ప్రదేశ్ తొలి విడత పోలింగ్ పూర్తవుతూనే.. ఉత్తరాఖండ్ పైన బీజేపీ అగ్రనేతలు ఫోకస్ పెట్టారు. ఉత్తరాఖండ్ లో ఈ నెల 14న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇప్పటికే బీజేపీ కీలక నాయకత్వం అక్కడ రంగంలోకి దిగింది. ఇక, నేరుగా ప్రధాని మోదీ... హోం మంత్రి అమిత్ షా ప్రచారంలోకి వస్తున్నారు. ఫిబ్రవరి 11 న హల్ద్వానీలోని రాంలీలా మైదాన్లో జరిగే ఎన్నికల బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు అమిత్ షా యూపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే ఫిబ్రవరి 14న రాష్ట్రంలో జరిగే పోలింగ్కు ముందు ఆయన ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టనున్నారు.
హోంమంత్రి ర్యాలీని విజయవంతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీగా సన్నాహాలు ప్రారంభించింది. పార్టీ అభ్యర్థి యోగేంద్ర సింగ్ రౌతేలాకు మద్దతుగా హల్ద్వానీలో ఎన్నికల సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. అమిత్ షా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీ డిసెంబర్లో హల్ద్వానీ, డెహ్రాడూన్లలో ప్రచారం నిర్వహించారు.ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో నిరంతరం ప్రచారం నిర్వహిస్తున్నారు.

దీంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగు రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేశారు. మరోవైపు ఫిబ్రవరి 12న ఖాతిమా, కోట్ద్వార్, రూర్కీలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించనున్నారు. అయితే, బీజేపీ నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడ్డవారు రెబల్స్ గా బరిలో నిలిచారు. ఇప్పుడు బీజేపీకి ఇదే పెద్ద సవాల్ గా మారుతోంది. ఇక, అస్సాం సీఎం సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. రెబల్స్ ను దారి లోకి తెచ్చేందుకు బీజేపీ నాయకత్వం శత విధాలా ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications