వ్యాక్సిన్ అంటే బెంబేలు-మెడికల్ బృందంపై రాడ్లతో దాడి-మధ్యప్రదేశ్లో దారుణ పరిస్థితులు
కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఎంత ముఖ్యమో ప్రభుత్వాలు,ఆరోగ్య సంస్థలు మొత్తుకుంటూనే ఉన్నాయి... అయినా కొన్నిచోట్ల జనం వ్యాక్సిన్ అంటే ఆమడ దూరం పారిపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ అంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. అంతేనా... వ్యాక్సిన్ వేసేందుకు వచ్చే హెల్త్ కేర్ వర్కర్స్పై దాడులకు కూడా పాల్పడుతున్నారు. తాజాగా ఉజ్జయిని జిల్లాలోని మలిఖేడి గ్రామంలో వ్యాక్సిన్పై అవగాహన కల్పించేందుకు వెళ్లిన అధికారుల బృందంపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు.

రాడ్లతో మెడికల్ బృందంపై దాడి...
స్థానిక మహిళా తహశీల్దార్ నేత్రుత్వంలో మెడికల్ బృందం సోమవారం(మే 24) మలిఖేడి గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు వ్యాక్సిన్పై అవగాహన కల్పించే ప్రయత్నం చేయగా... వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. మెడికల్ బృందంలోని సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన గ్రామస్తులు రాడ్లతో వారిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో మెడికల్ అసిస్టెంట్ సెక్రటరీ భర్త ఒకరు గాయపడ్డారు. అంతకుముందు రోజు కూడా వ్యాక్సిన్ టీమ్ ఆ గ్రామానికి వెళ్లగా వ్యాక్సిన్లు తీసుకునేందుకు గ్రామస్తులు నిరాకరించారు. దీంతో మరుసటిరోజు స్థానిక అధికారులతో కలిసి వారికి అవగాహన కల్పించేందుకు వెళ్లారు.

50 మంది దాడి.. తలకు గాయం...
'గ్రామస్తుల్లో వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు స్థానిక తహశీల్దార్,ఏఎన్ఎం,ఆశా వర్కర్లు,స్థానిక పట్వారీ తదితరులు కలిసి మలిఖేడి గ్రామానికి వెళ్లారు. గ్రామంలోకి ఆ బృందం ప్రవేశించగానే దాదాపు 50 మంది గుంపు చేతుల్లో రాడ్లు,కత్తులు పట్టుకుని వారి పైకి దూసుకెళ్లారు. ఆ బృందాన్ని అడ్డుకుని అసభ్య పదజాలంతో వారిని దూషించారు. ఆ మూకకు మెడికల్ బృందం నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. అంతా కలిసి ఒక్కసారిగా దాడికి దిగగా... మా బృందంలోని సభ్యులు తప్పించుకోగలిగారు. కానీ నాకు మాత్రం తలకు గాయమైంది..' అని మెడికల్ అసిస్టెంట్ సెక్రటరీ భర్త షకీల్ మహమ్మద్ ఖురేషీ తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
యూపీ,మధ్యప్రదేశ్లలో దారుణ పరిస్థితులు
ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,బిహార్లలో వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో తీవ్ర అపోహలు నెలకొన్నాయి. అందుకే మెడికల్ బృందాలపై దాడులు చేయడం లేదా వారి నుంచి తప్పించుకుని పారిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లోని బరబంకి గ్రామంలో... వ్యాక్సినేషన్ టీమ్ నుంచి తప్పించుకునేందుకు గ్రామస్తులు స్థానిక సరయూ నదిలో దూకి తప్పించుకున్నారు. దీనిపై మీడియా వారిని ప్రశ్నించగా... అది వ్యాక్సిన్ కాదని,విషపు ఇంజెక్షన్ అని కొంతమంది తమతో చెప్పారన్నారు. స్థానిక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. గ్రామస్తులకు ఎంత చెప్పినా వారు వినిపించుకోవట్లేదన్నారు. ఆ గ్రామంలో కేవలం 14 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications