మంత్రికి వింత అనుభవం.. డబ్బా పీతలు తెచ్చి.. ఇంటిముందు కుమ్మరించి.. (వీడియో)
ముంబై: నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిన మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడతారా అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పీతల గురించి మంత్రి వెటకారంగా మాట్లాడారో అవే పీతలు తెచ్చి ఆయన ఇంటిముందు రాసులుగా పోసి ఆందోళనకు దిగారు నిరసనకారులు. అంతేకాదు సదరు మంత్రి వ్యాఖ్యలు విపక్ష నేతలకు అస్త్రంగా మారింది.
మంత్రి మెడకు పీతల వివాదం
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని తివారీ డ్యామ్కు గండి పడింది. అయితే నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తివారీ డ్యామ్కు పీతల వల్లే గండి పడిందని ఆయన మాట్లాడిన తీరు నిరసనలకు దారి తీస్తోంది.
మంత్రి హోదాలో ఉండి ఆయన అలా మాట్లాడటంపై సామాన్యుడి నుంచి విపక్ష నేతల దాకా భగ్గుమంటున్నారు.
2004లో నిర్మించిన ఈ డ్యామ్లో గత పదిహేనేళ్లుగా నీటిని నిల్వ చేస్తున్నామని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు లీకేజీలు లేవని.. ఎన్నడూ కూడా ఇలా గండిపడలేదని వ్యాఖ్యానిస్తూ నోరు జారారు సదరు మంత్రి. ఇటీవల డ్యామ్లో పీతలు విపరీతంగా పెరిగిపోయాయని.. అవి రంధ్రాలు చేయడం వల్లే గండి పడిందన్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పందిస్తూ తప్పును కప్పిపుచ్చుకోవడానికే మంత్రి ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

వినూత్న నిరసన.. డబ్బెడు పీతలు కుమ్మరించి..!
మంత్రి వ్యాఖ్యలపై మరోవైపు నిరసనల పర్వం జోరందుకుంది. మంత్రి మాట్లాడిన తీరును ఖండిస్తూ కొందరు ఆందోళనకారులు వినూత్న నిరసన చేపట్టారు. పీతల వల్లే డ్యామ్కు డ్యామేజీ జరిగిందంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ వెంట ఓ డబ్బాలో తీసుకొచ్చిన పీతల్ని ఆయన ఇంటిముందు గుమ్మరించారు. ఫ్లెక్సీలు ప్రదర్శించి నిరసన తెలిపారు.
వెరైటీగా మంత్రికి నిరసన సెగ అంటించారు ఆందోళనకారులు. మంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడుతారా అంటూ ఫైరయ్యారు. ఇక రత్నగిరి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి ఇంటిలో పేరుకుపోయిన పీతల్ని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు.

ఎన్సీపీ నేతలకు అస్త్రం.. పోలీస్ స్టేషన్కు పీతలు
మంత్రి వ్యాఖ్యలను ఎన్సీపీ నేతలు అస్త్రంగా మలచుకుంటున్నారు. తివారీ డ్యామ్ గండిపడటానికి కారణమైన పీతల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కొన్ని పీతలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇదంతా కూడా మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా చేసిందే. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకుంటూ సమస్యను పక్కదారి పట్టించేలా ఇలా పీతలపైకి నెట్టడమేంటని మండిపడ్డారు.
భారీ వర్షాల కారణంగా తివారీ డ్యామ్కు గండిపడటంతో.. దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న కొందరు వరదలో గల్లంతయ్యారు. ఆ క్రమంలో దాదాపు 20 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు ఏడు గ్రామాలు నీటమునిగాయి. డ్యామ్కు కొన్ని సంవత్సరాలుగా మరమ్మతులు చేయకపోవడంతోనే గండి పడిందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications