బీజేపీ ఎంపీ ఇంటిపైకి రాళ్లేసిన వరుణ్ మద్దతుదారులు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి చెందిన ఆలహాబాద్ ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా ఇంటిపై ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మద్దతుదారులు రాళ్లు విసిరారు. వరుణ్ గాంధీ తల్లి, కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీపై ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ఈ రాళ్ల దాడి చేసినట్లు తెలిపారు.
ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా ఇంటి మందు అతని దిష్టి బొమ్మను దగ్దం చేశారు. "ఒక ఎంపీ స్దానంలో ఉండి అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుప్తా క్షమాపణలు చెప్పాలి. అతని దిష్టిబొమ్మను తగలబెట్టి ఈ సంఘటనను ఖండిస్తున్నాం. " అని వరుణ్ గాంధీ మద్దతుదారుడు అమిర్ గోస్వామి అనే తెలిపారు.
గత నెలలో ఓ బహిరంగ సభలో మాట్లాడిన మేనక గాంధీ, ఉత్తరప్రదేశ్కు తన కుమారుడు వరుణ్ గాంధీ ఉత్తమ ముఖ్యమంత్రి కాగలడని, ఆ రాష్ట్రాన్ని సరైన మార్గంలో పాలించగలడని అన్నారు. దీనిపై మండిపడ్డ ఎంపీ శ్యామచరణ్ గుప్తా, ఉత్తర ప్రదేశ్కి వరుణ్ను సీఎం చేసేందుకు మేనక ప్రయత్నిస్తున్నారన్నారు.
ఇంత తొందరపాటుగా మాట్లాడటం సరికాదన్నారు. భవిష్యత్తులో మేనకలాగే మిగతా నేతలు కూడా తమ పిల్లల గురించి ఇలాగే మాట్లాడతారని వ్యాఖ్యానించారు. ఈ మాటలకు కోపానికి గురైన వరుణ్ మద్దతుదారులు గుప్తా ఇంటిపై రాళ్ల దాడి చేశారు.