ప్రధానితో వెంకయ్య, సీమాంధ్రకు ప్యాకేజీ: చిరు సైలెంట్గా
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం ఒకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) రాజ్యసభకు రావడానికి ముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిశారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. దానికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
రాజ్యసభలో పెద్దగా చర్చ లేకుండానే....
సీమాంధ్రకు భారీ ప్యాకేజీకి కేంద్రం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో తెలంగాణ ముసాయిదా బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లాంఛనమే అనిపిస్తోంది. బిల్లు పైన పెద్దగా చర్చ జరగకుండానే ఆమోదం లభించే అవకాశాలున్నాయి. ఏవైనా కొన్ని సవరణలు చేస్తే బిల్లు మళ్లీ లోకసభకు వెళ్తుంది.

రాజ్యసభ వాయిదా
బుధవారం రాజ్యసభ పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఓ వైపు బిల్లులకు ఆమోదం తెలుపుతుండగానే సభలో సీమాంధ్ర మంత్రులు, ఎంపీల నిరసన కొనసాగింది. రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ వెల్లో కెవిపి రామచంద్ర రావు నిలబడి 'వి వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్' ఉన్న ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపారు. చిరంజీవి కూడా నిశ్సబ్దంగా తన స్థానంలో నిలబడి నిరసన తెలిపారు. సభలో గందరగోళం ఏర్పడటంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను ఐదు గంటల వరకు వాయిదా వేశారు.
అనంతరం ఐదు గంటలకు సభ ప్రారంభమైంది. ఈ దశలో కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు తెలంగాణ బిల్లు పైన మాట్లాడే ప్రయత్నాలు చేశారు. ఏ ప్రాతిపదికన టి బిల్లు పెడతారని ప్రశ్నించారు. సెంటిమెంట్, స్వయంపాలన పేరుతో విభజించుకుంటూ పోతే దేశం ముక్కలవుతుందన్నారు. బిల్లు పెట్టకముందు మాట్లాడవద్దని కురియన్ సూచించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.
తల్లి కల నెరవేరింది: గీతా రెడ్డి
తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు పోరాడాయని గీతా రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో సోనియా గాంధీకి కృతజ్ఞత తెలపడానికి కెసిఆర్ ఒక భారీ సభ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోందని, అదే నిజమైతే వారు తమతో కలసిపోతే ఇంకా బాగుంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటుతో తన తల్లి ఈశ్వరీబాయి కల నెరవేరుతోందన్నారు.












Click it and Unblock the Notifications