మహిళలకు ఆ స్వేచ్ఛ కూడా లేదా: మాజీ ముఖ్యమంత్రులు
బెంగళూరు: కర్ణాటకలో కొద్దిరోజులుగా కొనసాగుతున్న హిజబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు తుది తీర్పు వెలువడించింది. హిజబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలు, విద్యాసంస్థలు, పాఠశాలలకు హాజరు కావడాన్ని నిషేధిస్తూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. హిజబ్ను ధరించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మిశ్రమ స్పందన లభిస్తోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ లోక్సభ సభ్యుడు, యువజన మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్.. ఈ తీర్పును స్వాగతించారు. విద్యార్థులకు మతపరమైన అంశాల కంటే చదువు అత్యవసరమని, విద్యాసంస్థల్లో అడుగు పెట్టే ప్రతి విద్యార్థీ సమానమేననే విషయాన్ని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టం చేసినట్టయిందని అన్నారు.
ఈ తీర్పు పట్ల ముస్లిం సామాజిక వర్గాల నుంచి ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ఈ తీర్పుపై స్పందించారు. ఈ తీర్పు తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు. మత స్వేచ్ఛను అడ్డుకున్నట్టయిందని వ్యాఖ్యానించారు. హిజబ్ అనేది ముస్లిం మహిళలు ధరించే ఓ సాధారణ వస్త్రం కాదని భావించినట్టు ఉందని పేర్కొన్నారు. ఓ మహిళ తాను ఏ రకమైన వస్త్రాలను ధరించాలనే విషయంపై ఉన్న స్వేచ్ఛను హరించినట్టయిందని అన్నారు.
పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఇదే రకంగా రియాక్ట్ అయ్యారు. ఏ దుస్తులు ధరించాలో మహిళలకు నిర్దేశించినట్టయిందని వ్యాఖ్యానించారు. హిజబ్ను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు సమర్థించడం నిరాశ కలిగించిందని చెప్పారు. ఒకవైపు మహిళల సాధికారికత గురించి మాట్లాడుతూనే.. మరోవైపు ఎలాంటి దుస్తులను ధరించాలనేది తామే నిర్దేశించినట్టయిందని అన్నారు.
Recommended Video
కర్ణాటక హైకోర్టు హిజబ్ విషయంలో తీర్పు వెలువడించిన అనంతరం బొమ్మై తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాజ్యంగం, చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు. విద్యాసంస్థల్లో కులాలు, మతాలకు అవకాశం లేదని అన్నారు. విద్యార్థులందరూ సమానమేననే ఉద్దేశంతోనే యూనిఫాం వ్యవస్థ అమల్లో ఉందని పేర్కొన్నారు. హిజబ్పై ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును పాటించాలని ప్రతి విద్యార్థికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.