రాష్ట్రపతికి అలాంటి లేఖ రాయలేదు..సంతకం చేయలేదు: రిటైర్డ్ జనరల్ రాడ్రిగ్స్
బాలాకోట్ పై భారత బలగాలు చేసిన దాడులను రాజకీయ లబ్ది కోసం కొన్ని పార్టీలు వినియోగించుకుంటున్నాయంటూ..అలా చేయరాదంటూ త్రివిధ దళాలకు చెందిన ఎనిమిది మంది మాజీ చీఫ్లు రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదే అంశంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అలాంటి లేఖ తమకు అందలేదని రాష్ట్రపతి భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు తాను లేఖపై సంతకం చేశానని చెబుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని రిటైర్డ్ జనరల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకే చర్యలకు దిగుతామని అయితే త్రివిధ దళాలు ఏ ఒక్క రాజకీయపార్టీకి కొమ్ముకాయవని వెల్లడించారు. ఎవరో కొందరు తాము లేఖరాసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
#WATCH Goa: General SF Rodrigues who is mentioned as the first signatory in the purported letter written by armed forces veterans to President, denies signing it. pic.twitter.com/h1PNBCV909
— ANI (@ANI) April 12, 2019
బాలాకోట్పై భారత బలగాలు చేసిన దాడులను పార్టీలు రాజకీయం చేయడం తగదని పేర్కొంటూ త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్కు మాజీ త్రివిధ దళాల ఛీఫ్లు 8మంది లేఖ రాసినట్లు తొలుత వార్తలు వచ్చాయి.. లోక్సభ ఎన్నికల్లో బాలాకోట్ దాడులను చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం పార్టీలు చేస్తున్నాయని లేఖలో ఉంది. భారత ఆర్మీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండదని వారు గుర్తు చేశారు. అంతేకాదు త్రివిధ దళాలు ప్రభుత్వ జోక్యాన్ని ప్రజాస్వామ్య పద్దతిలో వ్యతిరేకించాయని అన్నారు.
ఇక లేఖ రాసి సంతకాలు చేసిన వారిలో మాజీ ఆర్మీ చీఫ్లు జనరల్ ఎస్ఎఫ్ రాడ్రిగ్స్, జనరల్ దీపక్ కపూర్, మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్సీ సూరీ, మాజీ నేవీ చీఫ్ సురేష్ మెహతా పేర్లు ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేసిన "మోడీ జీ కి సేనా " వ్యాఖ్యలను ఈ లేఖలో ప్రస్తావించినట్లుగా ఉంది.
శతృదేశాలపై భారత బలగాలు చేసిన దాడులను రాజకీయ లబ్ధికోసం వినియోగించుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ మాజీ చీఫ్లు తెలిపారు. జవాన్లను మోడీ సైన్యం అని యూపీ సీఎం తన ర్యాలీల్లో చెప్పడాన్ని వీరు తప్పుబట్టారు. ఇప్పటికే ఎన్నికల సంఘం యోగీ ఆదిత్యనాథ్ను హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. ఇక పార్టీ కార్యకర్తలు మిలటరీ యూనిఫాంలు ధరించి, ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఫోటోలతో ప్రచారం నిర్వహించడాన్ని కూడా తప్పుబట్టారు. రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నాయని మాజీ చీఫ్లు లేఖలో తెలిపినట్లుగా ఉంది. పోలింగ్కు సమయం దగ్గర పడే కొద్దీ ఇలాంటి మరిన్ని పెరుగే అవకాశం ఉందని వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరినట్లుగా లేఖలో ఉంది. అయితే రాష్ట్రపతి కార్యాలయానికి మాజీ త్రివిధ దళాధిపతుల నుంచి ఎలాంటి లేఖ రాలేదని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.
మొత్తానికి ఈ లేఖ ఎవరు రాశారు... సంతకాలు పెట్టకున్నప్పటికీ ఆ లేఖపై సంతకాలు ఎవరు చేశారన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.