వాటినుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేసిన వెంకయ్యనాయుడు
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కౌంటర్ వేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈడీ విచారణకు పిలవడం సరైనదేనా? అంటూ రెండురోజుల క్రితం సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రంపై ఖర్గే మండిపడ్డారు. అదే సభలో ఉన్న మంత్రి పీయూష్ గోయల్ ఖర్గేకు సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సమావేశాలతో సంబంధం లేకుండా దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలన్నారు. పౌరులుగా అది మన బాధ్యత అని, ఎంపీలకు ఇందులో మినహాయింపు లేదని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు విచారణకు పిలిస్తే హాజరవ్వల్సిందేనని, చట్టాలను, న్యాయ ప్రక్రియను గౌరవించడం మన బాధ్యత అని, చట్టాన్ని అమలుచేసే సంస్థల సమన్లను ఎంపీలైనా తప్పించుకోలేరన్నారు.

సభలో రెండు రోజుల కిందట జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఖర్గే తనకు ఈడీ సమన్లు జారీచేయడాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీ భయపెట్టాలని చూస్తోందని, కానీ తాము భయపడబోమని, కేంద్రం ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని, ఈడీ చర్యలకు కేంద్రమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు కూడా సమన్లు అందాయని, చట్టానికి లోబడి ఉంటానని, కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు విచారణకు పిలవడం సరైనదేనా? అని ప్రశ్నించారు. సోనియా, రాహుల్ నివాసాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కేంద్రానికి వ్యతిరేకంగా తాము పోరాడతామన్నారు.












Click it and Unblock the Notifications