'బొట్టు పెట్టుకోలేదని.. తాకరాని చోట తాకి, రక్తం వచ్చేదాకా కొట్టారు'
పుణే సమీపంలోని ఇసాపూర్ కోట వద్ద జరిగిన ఈ దారుణానికి సంబంధించి ట్రెక్కింగ్ బృందంలో ఉన్న మహిళ ఒకరు మీడియా ముందుకు వచ్చి పలు విషయాలు వెల్లడించారు.
పుణే: బెంగుళూరులో మహిళలపై జరిగిన ఆకృత్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే.. మహారాష్ట్రలో మహిళలపై మరో అమానుష దాడి జరిగింది. ట్రెక్కింగ్ కోసం వెళ్లిన బృందంపై శివాజీ భక్తులుగా చెప్పుకునే కొంతమంది యువకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
మోరల్ పోలిసింగ్ పేరిట ట్రెక్కింగ్ బృందంపై శివాజీ భక్తులు చేసిన ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తాజాగా వెలుగుచూశాయి. పుణే సమీపంలోని ఇసాపూర్ కోట వద్ద జరిగిన ఈ దారుణానికి సంబంధించి ట్రెక్కింగ్ బృందంలో ఉన్న మహిళ ఒకరు మీడియా ముందుకు వచ్చి పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
మద్యం తాగకపోయినా.. తాగామని ఆరోపించి..:
'మా బృందంలో మొత్తం 10 మంది ఉన్నాం. మధ్యాహ్నం 12గం. సమయంలో కోట వద్దకు వెళ్లాము. సాయంత్రం 7 గంటల సమయంలో క్యాంప్ ఫైర్ వేసుకుని కూర్చున్నాం. ఇంతలో శివాజీ భక్తులమని చెప్పుకుంటూ 20మంది 'ఫోర్డ్ లవర్స్' బ్యాచ్ అక్కడికి వచ్చింది. మేము మద్యం తాగకపోయినా, తాగుతున్నామని ఆరోపిస్తూ మమల్ని నిర్బంధించారు'.
బొట్టు పెట్టుకోలేదని .. తాకరాని చోట:
'నేను బొట్టు పెట్టుకోలేదన్న కారణంగా.. నాపై దాడి చేశారు. నేను హిందువునేనని చెబుతున్నా వారు వినిపించుకోలేదు. రక్తం వచ్చేట్టు కొట్టారు.. తీవ్ర వేధింపులకు గురిచేశారు. తాకరాని చోట తాకి దూషించారు. వ్యభిచారులమని ఆరోపించారు. మా బృందంలోని మిగతా అమ్మాయిలదీ ఇదే పరిస్థితి. నిబంధనలకు అనుగుణంగానే మేము ఇక్కడికి వచ్చామని చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదు.'
బట్టలూడదీసి మరీ..
'దాదాపు ఐదు గంటల పాటు మమ్మల్ని నిర్బంధించి వేధింపులకు గురిచేశారు. మాతోపాటు ఉన్న స్నేహితులను బట్టలూడదీసి మరీ విచక్షణా రహితంగా చావబాదారు. 'శివాజీ మహరాజ్ కీ జై' అని నినాదాలు చేస్తూ తమ వేధింపుల పర్వాన్ని కొనసాగించారు. మమ్మల్ని తీసుకెళ్లిన ఆర్గనైజర్ ను విపరీతంగా కొట్టారు. నా భర్త, ఆయన స్నేహితులు పర్వతారోహణపై శిక్షణ తీసుకుంటున్నారు. ఆయనతో పాటు నేనూ ఉన్నాను. మా వెంట ఐదేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు'.
ఫిర్యాదు వద్దన్న పోలీసులు:
'చివరికి సమీపంలోని గ్రామస్థులు, పోలీసులు అక్కడికి చేరుకోవడంతో మాకు వారి నుంచి విముక్తి కలిగింది. మేం మద్యం తాగామన్న ఆరోపణలతో.. స్టేషన్ కు తీసుకెళ్లి మాకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేశారు. తాము మద్యం తాగలేదని తేలడంతో.. పోలీసులు సైతం ఫిర్యాదు చేయవద్దని మాపై ఒత్తిడి చేశారు' అని సదరు వివాహిత మీడియాతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.