పసివాళ్లను వేలాడదీసి... ఓ కన్నతండ్రి కిరాతకం, వీడియో చూసి పట్టేసిన పోలీసులు!
రాజస్థాన్ : పసిపిల్లలంటే ఎవరికి ఇష్టముండదు? ముద్దులొలికే చిన్నారులు కనిపిస్తే చాలు.. ముద్దు చేయాలనిపిస్తుంది. మన పిల్లలు కాకపోయినా.. వాళ్లకేదైనా ఇబ్బంది కలిగినట్లు తెలిస్తే మన మనసు చివుక్కుమంటుంది.
అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోను చూసిన వారందరికీ అదెక్కడ జరిగిందో తెలుసుకోవాలన్న ఆక్రోశం కలిగింది. వాడెవడో తెలియకున్నా.. తిట్లు, శాపనార్థాలు పెట్టారు నెటిజన్లు.

చివరికి ఆ దుర్మార్గం రాజస్థాన్లో జరిగిందని తేలింది. పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కోసం వేటాడారు. చివరికి పట్టేశారు. ఆ కిరాతకుడి పేరు చైన్ సింగ్(32). రాజస్థాన్లోని రాజసమంద్లో ఉంటున్నాడు. ఇతడికి ఐదేళ్ల వయసున్న కుమారుడు, మూడేళ్ల వయసున్న పాప ఉన్నారు.
కన్నతండ్రిగా పిల్లల ఆలనా పాలనా చూసుకోవాల్సింది పోయి పిల్లల పాలిట కిరాతకుడిగా మారాడు చైన్ సింగ్. గొడ్డును బాదినట్టు బాదాడు. అభం శుభం తెలియని చిన్నారులని కూడా చూసుకోకుండా కర్రతో ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. అతడంతగా రెచ్చిపోవడానికి పెద్ద కారణం కూడా లేదు. దుస్తులు మురికి చేసుకుంటున్నారట.. అంతే!
ఇది విన్న ప్రతిఒక్కరికీ 'ఛ.. వాడసలు తండ్రేనా?' అనిపించకమానదు. చిన్నారులిద్దరినీ తాడుతో కట్టేసి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. బాబు చేతులు తాడుతో కట్టేసి అతడిని సీలింగ్కు వేలాడదీశాడు. ఆ చిన్నారులిద్దరూ ఎంత ప్రాధేయపడినా.. ఆ తండ్రి మనసు కరగలేదు.
చైన్ సింగ్ బిడ్డలను గొడ్డును బాదినట్లు చావబాదుతుంటే... అడ్డుపడి ఆపాల్సింది పోయి ఆ దృశ్యన్నంతా తన సెల్ఫోన్లో వీడియో తీశాడు అతడి సోదరుడు వట్టా సింగ్. అంతటితో ఊరుకోకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
అప్లోడ్ అయినా కాసేపటికే ఆ వీడియో వైరల్గా మారింది. చూసిన వాళ్లందరూ పిల్లల్ని కొడుతున్న చైన్సింగ్ కు శాపనార్థాలు పెట్టారు. కానీ.. అతడెవరో, అసలు ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు.
అయితే రాజస్థాన్ పోలీసులకు ఈ వీడియో చేరగానే.. వాళ్లు రంగంలోకి దిగి చైన్సింగ్ను, అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేశారు. చైన్సింగ్ తరచూ పిల్లలను కొడుతూనే ఉంటాడని ఇరుగుపొరుగు వాళ్లు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications